ఢిల్లీకి సొంత పాఠశాల విద్యా మండలి : కేజ్రీవాల్
ABN , First Publish Date - 2021-03-06T20:39:58+05:30 IST
ఇతర రాష్ట్రాలకు ఉన్నట్లుగానే ఢిల్లీకి కూడా సొంతంగా పాఠశాల విద్యా మండలిని
న్యూఢిల్లీ : ఇతర రాష్ట్రాలకు ఉన్నట్లుగానే ఢిల్లీకి కూడా సొంతంగా పాఠశాల విద్యా మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఈ మండలి ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
ఢిల్లీలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు, 1,700 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అత్యధిక ప్రైవేటు పాఠశాలలు సీబీఎస్ఈకి అనుబంధంగా నడుస్తున్నాయన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో 20 నుంచి 25 వరకు ప్రభుత్వ పాఠశాలలను నూతన మండలి పరిధిలోకి తెస్తామన్నారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, తల్లిదండ్రులతో చర్చల అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
యాంత్రికంగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టకూడదని, కాన్సెప్ట్లను అర్థం చేసుకునేవిధంగా, వ్యక్తిత్వ వికాసం జరిగే విధంగా విద్యాభ్యాసం ఉండాలని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ ఉండాలన్నారు.