మళ్లీ మళ్లీ తినాలనిపించే స్నాక్స్‌!

ABN , First Publish Date - 2021-05-29T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ సాయంత్రం సమయంలో స్నాక్స్‌పైకి మనసు లాగేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రాగి కుకీస్‌, రాజ్మా కబాబ్స్‌, బ్రొకోలి పనీర్‌ పీనట్‌ సాండ్‌

మళ్లీ మళ్లీ తినాలనిపించే స్నాక్స్‌!

లాక్‌డౌన్‌ వేళ సాయంత్రం 

సమయంలో స్నాక్స్‌పైకి 

మనసు లాగేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రాగి 

కుకీస్‌, రాజ్మా కబాబ్స్‌, బ్రొకోలి పనీర్‌ పీనట్‌ సాండ్‌

విచ్‌, రాగి చక్లీలు వంటి వాటిని తీసుకోవాలి.

ఈ స్నాక్స్‌ జీర్ణశక్తిని

పెంచుతాయి. పైగా 

ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తాయి. మరి వాటి రుచిని మీరూ ఆస్వాదించండి.


రాజ్మా గలౌటీ కబాబ్స్‌

కావలసినవి

రాజ్మా - ఒక కప్పు, జీడిపప్పు - పది పలుకులు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, యాలకులు - రెండు, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కశ్మీరీ కారం - అర టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, రోజ్‌ వాటర్‌ - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, శనగపిండి - పావుకప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం

ముందుగా రాజ్మాను ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి.

జీడిపప్పును గోరవెచ్చటి నీళ్లలో నానబెట్టి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి.

నానబెట్టిన రాజ్మాను కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఆరు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

కుక్కర్‌లో ఆవిరిపోయిన తరువాత నీళ్లను వంపేసి రాజ్మాను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి.

తరువాత వేగించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, యాలకులు, ధనియాలపొడి, కుంకుమపువ్వును మిక్సీలో వేసి పట్టుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్టును రాజ్మా మిశ్రమంలో కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరంమసాల, రోజ్‌వాటర్‌, నెయ్యి, శనగపిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె రాసి వేడి చేసుకోవాలి.

రాజ్మా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేత్తో కబాబ్‌లు చేస్తూ పాన్‌లో పెట్టి వేగించాలి.

గోధుమరంగులోకి మారే వరకు రోస్ట్‌ చేసుకోవాలి.

వాటిని గ్రీన్‌ చట్నీతో తింటే రుచి చాలా బాగుంటుంది.


బ్రొకోలి పనీర్‌ పీనట్‌ శాండ్‌విచ్‌

కావలిసనవి

వీట్‌ బ్రౌన్‌ బ్రెడ్‌ - నాలుగు, బ్రొకోలి - ఒకటి, పనీర్‌ - 150గ్రా, వేగించిన వేరుశనగలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, రెడ్‌ ఛిల్లీ సాస్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా.


తయారీ విధానం

బ్రొకోలిని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పనీర్‌ను కట్‌ చేసి పెట్టుకోవాలి.

ఒక పాత్రలో బ్రొకోలి ముక్కలు తీసుకుని ఒక కప్పు వేడి నీళ్లు పోయాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. కాసేపు వేగిన తరువాత వేడినీళ్లలో నుంచి బ్రొక్కోలి ముక్కలు తీసి పాన్‌లో వేయాలి. కాసేపు వేగించాలి. ఎక్కువ సేపువేగిస్తే బ్రొకోలిలో ఉన్న పోషకాలు నశిస్తాయి.

తరువాత పనీర్‌ ముక్కలు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. 

స్టవ్‌పై నుంచి దింపుకొన్న తరువాత వేగించిన వేరుశనగలు వేసి కలపాలి.

శాండ్‌విచ్‌ మేకర్‌ను ప్రీహీట్‌ చేయాలి.

ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలకు వెన్న రాసుకోవాలి. ఒక బ్రెడ్‌ ముక్కపై బ్రొకోలి మిశ్రమం పెట్టి, మరో బ్రెడ్‌ ముక్కను పైన పెట్టి శాండ్‌విచ్‌ మేకర్‌లో గోధుమరంగులోకి మారే వరకు టోస్ట్‌ చేయాలి. 

సర్వింగ్‌ ప్లేట్‌లోకి తీసుకుని ఏదైనా స్మూతీతో లేదా జ్యూస్‌తో కలిపి సర్వ్‌ చేసుకోవాలి.


మెలన్‌ కివీ స్మూతీ

కావలసినవి

హనీడ్యూ మెలన్‌ - రెండు కప్పులు, కివీ పండ్లు - మూడు, వెనీలా యోగర్ట్‌ - ఒక కప్పు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఐస్‌ క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం

మెలన్‌, పొట్టు తీసిన కివీ పండ్లు, యోగర్ట్‌, నిమ్మరసం, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, తేనె, ఐస్‌ ముక్కలను బ్లెండర్‌లో వేసి పట్టుకోవాలి.

అవసరమైతే రుచి కోసం మరింత యోగర్ట్‌, తేనె కలుపుకోవాలి.

చల్లచల్లగా సర్వ్‌ చేసుకోవాలి.


రాగి కుకీస్‌

కావలసినవి

వెన్న - పావుకప్పు, పాలు - మూడు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌ - అర టీస్పూన్‌, రాగి పిండి - ముప్పావు కప్పు, గోధుమపిండి - పావు కప్పు, కోకో పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, బేకింగ్‌పౌడర్‌ - అర టీస్పూన్‌, పంచదార - పావుకప్పు.


తయారీ విధానం

ఒక పాత్రలో రాగిపిండి, గోధుమపిండి, కోకోపౌడర్‌, బేకింగ్‌పౌడర్‌, పంచదార వేసి కలుపుకోవాలి.

తరువాత కరిగించిన వెన్న, వెనీలా ఎసెన్స్‌ వేసి కలియబెట్టాలి.

ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్పూన్‌తో పాలు కొద్దికొద్దిగా పోస్తూ మెత్తటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి.

ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా తీసుకుని, అరచేతిలో వత్తుకుంటూ కుకీలు తయారుచేసుకోవాలి.

కుకీ ట్రేలో బటర్‌ పేపర్‌ వేసి కుకీలను పెట్టాలి.

కడాయిలో రెండు కప్పుల ఉప్పు వేసి, స్టీల్‌ స్టాండ్‌ పెట్టి సుమారు పది నిమిషాల పాటు ప్రీహీట్‌ చేసుకోవాలి.

చివరగా కుకీస్‌ ఉన్న ట్రేను కడాయిలో పెట్టి మూత పెట్టి పావుగంటపాటు ఉడికించాలి. చల్లారిన తరువాత సర్వ్‌ చేసుకోవాలి.



మిక్స్‌డ్‌ మిల్లెట్‌ భేల్‌ పూరి

కావలసినవి

మిక్స్‌ మిల్లెట్‌ ఫ్లేక్స్‌ - ఒక కప్పు, రాగి ఫ్లేక్స్‌ - ఒక కప్పు, మురమురాలు (ఫఫ్డ్‌ రైస్‌ ఫ్లేక్స్‌) - మూడు కప్పులు, వేరుశనగలు - అరకప్పు(వేగించినవి), అమర్‌నాథ్‌, కారప్పూస - అరకప్పు, ఛాట్‌ మసాల - రెండు టేబుల్‌స్పూన్లు, నల్ల నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు, బంగాళదుంపలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - రెండు, నిమ్మరసం - నాలుగు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, గ్రీన్‌ చట్నీ - మూడు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, మునగాకు పొడి - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

ముందుగా బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి.

ఒక పాత్ర తీసుకుని అందులో మిక్స్‌ మిల్లెట్స్‌, రాగి ఫ్లేక్స్‌, మురమురాలు, వేగించిన వేరుశనగలు, అమర్‌నాథ్‌, కారప్పూస వేసి కలుపుకోవాలి. తరువాత ఛాట్‌ మసాల చల్లుకుని, నల్ల నువ్వులు వేసుకోవాలి.

తరువాత బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, నిమ్మరసం, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు మునగాకు పొడి, గ్రీన్‌చట్నీ వేసి కలపాలి.

చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-05-29T05:30:00+05:30 IST