పదవులలో దూదేకులకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-08-01T09:25:04+05:30 IST
ముస్లిం దూదేకులను వర్గీకరణ చేయాలని.., ప్రభుత్వం, పార్టీలో పదవులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల జేఏసీ నేతలు
జేఏసీ నేతల డిమాండ్
విజయవాడ (వన్టౌన్), జూలై 31 : ముస్లిం దూదేకులను వర్గీకరణ చేయాలని.., ప్రభుత్వం, పార్టీలో పదవులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని గొల్లపూడిలో గల హెచ్వో కన్వెన్షన్ హాలులో ఆదివారం దూదేకుల ఆత్మగౌరవ పోరాట రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సభలో దూదేకుల వారు ఎదుర్కొం టున్న అనేక సమస్యలపై చర్చించారు. దూదేకులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ, పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడంలేదని నాయకులు పేర్కొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మహాబూబ్ బాషా, ఎస్ఎస్ బాజీ, తెలంగాణ రాష్ట్ర దూదేకుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ బాజీ తదితరులు మాట్లాడుతూ... దశాబ్దాల కాలంగా పార్టీలు, ప్రభుత్వాలు చేసిన మోసాలతో విసిగి వేసారి పోయామన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్పొరేషన్లలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. పదవుల విషయంలో దూరంగా ఉంచుతున్నారన్నారు. ఇకపై ఎవరు ప్రాధాన్యమిస్తే వారికి మాత్రమే తమ మద్దతు ఉంటుందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి దూదేకులను చైతన్య పరుస్తామన్నారు. ఈ సందర్భంగా ముస్లిం ఆత్మగౌరవ పోరాట పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దూదేకుల ప్రతినిధులు హాజరయ్యారు.