అవే..దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాయి: రాహుల్

ABN , First Publish Date - 2021-08-17T22:00:57+05:30 IST

పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, సాగు చట్టాల వంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాయని ..

అవే..దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాయి: రాహుల్

కోజికోడ్: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, సాగు చట్టాల వంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్యల వల్ల యువతకు ఉద్యోగాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ఇండియా ఉందన్నారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం కారస్సెరీ బ్యాంక్ ఆడిటోరియంలో జరిగిన కారస్సెరీ పంచాయత్, రైతుల సన్మాన కార్యక్రమంలో రాహుల్ మంగళవారంనాడు ప్రసంగించారు. మన చరిత్ర, సంస్కృతి, వారసత్వంలో వ్యవసాయరంగం కీలకమని, ఏదైనా సృష్టించగలిగిన తెలివితేటలు రైతులకే ఉన్నాయనే నమ్మకం తనకు ఉందన్నారు. వారుసమాజానికి ఎంతో ఇచ్చారని కొనియాడారు.


దేశ రైతులు, వయనాడ్ రైతులు పెద్దగా ఏదీ కోరుకోరని, స్వచ్ఛమైన మనసునే ఆశిస్తారని, తమరంగంలో పోటీపడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. అయితే, ఇవాళ రైతులకు అలాంటి స్వచ్ఛమైన వాతావరణం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. మూడు సాగు చట్టాలు రైతుల వెన్నెముకను దెబ్బతీశాయని అన్నారు. సాగుచట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు పోరాటం సాగిస్తున్నారని, వారి ఆందోళనను తాను అర్ధం చేసుకున్నానని, వారు ఆందోళన కూడా సహేతుకమేనని చెప్పారు. దేశంలోని ఇద్దరు ముగ్గురు కార్పొరేట్లకు మేలు చేసేందుకే ఈ చట్టాలు తెచ్చారని కేంద్రాన్ని విమర్శించారు.


వ్యవసాయరంగంలో ఎలాంటి బలహీనతలు లేవని అనడం లేదని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్థను ప్రభుత్వం మెరుగుపరచాలే కానీ నడ్డివిరచకూడదని అన్నారు. మండీ వ్యవస్థను దెబ్బతీశారని, ఇందువల్ల రైతులకే కాకుండా ఆహార ధరల విషయంలో మధ్యతరగతి ప్రజలపైన, సామాజిక, ఆర్థిక స్థిరత్వంపైన కూడా దెబ్బపడుతుందని రాహుల్ అన్నారు.

Updated Date - 2021-08-17T22:00:57+05:30 IST