ఢిల్లీ అల్లర్ల కేసుల్లో దినేశ్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-01-20T19:55:01+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసుల్లో

ఢిల్లీ అల్లర్ల కేసుల్లో దినేశ్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసుల్లో దినేశ్ యాదవ్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ తీర్పు చెప్పారు. ఈ కేసుల్లో దోషిగా నిర్థరణ అయిన తొలి వ్యక్తి ఆయనే. ఓ ఇంటిని తగులబెట్టిన అల్లరి మూకలో ఆయన కూడా ఉన్నట్లు రుజువైందని కోర్టు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 


అడ్వకేట్ శిఖా గార్గ్ మాట్లాడుతూ, దినేశ్  యాదవ్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.12,000 జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, దినేశ్ అల్లరి మూకలో చురుగ్గా పాల్గొన్న సభ్యుడు. 2020 ఫిబ్రవరి 25 రాత్రి మనోరీ అనే 73 ఏళ్ళ వయసుగల మహిళ ఇంటిని ధ్వంసం చేసి, తగులబెట్టిన దుండగుల్లో దినేశ్ కూడా ఉన్నట్లు రుజువైంది. ఆయనను 2020 జూన్ 8న అరెస్టు చేశారు. ఆయన దోషి అని 2021 డిసెంబరు 6న కోర్టు ప్రకటించింది.


మనోరీ మాట్లాడుతూ, తన ఇంటిపై దాదాపు 200 మంది దుండగులు దాడి చేశారని తెలిపారు. తన గేదెతో సహా ఇంట్లోని అన్ని రకాల సామగ్రిని దోచుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరన్నారు. 


పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారికి, ఈ నిరసనలను వ్యతిరేకిస్తున్నవారికి మధ్య 2020 ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణల్లో 53 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 700 మంది గాయపడిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-01-20T19:55:01+05:30 IST