నీటి పారుదల శాఖ.. సరికొత్తగా
ABN , First Publish Date - 2021-01-12T05:38:06+05:30 IST
నీటి పారుదల శాఖ సరికొత్త రూపును సంతరించుకున్నది. ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణతో ప్రక్షాళనకు నోచుకున్నది. దీంతో చిన్న, మధ్య, భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులతో పాటుగా నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) కలిపి ఒకే గొడుగు కిందకు వచ్చాయి. సోమవారం నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కలిపి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం సంగారెడ్డిలో ఏర్పాటైంది.
ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణ
ఒకే గొడుగు కిందకు ఐడీసీ, చిన్న, మధ్య, భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులు
సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కలిపి సీఈ
చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టిన అజయ్కుమార్
నీటి పారుదల శాఖ సరికొత్త రూపును సంతరించుకున్నది. ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణతో ప్రక్షాళనకు నోచుకున్నది. దీంతో చిన్న, మధ్య, భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులతో పాటుగా నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) కలిపి ఒకే గొడుగు కిందకు వచ్చాయి. సోమవారం నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కలిపి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం సంగారెడ్డిలో ఏర్పాటైంది.
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 11
సోమవారం నుంచి నీటి పారుదల శాఖ నూతన కార్యకలాపాలు మొదలయ్యాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కలిపి సంగారెడ్డి కేంద్రంగా ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఏర్పాటైంది. సోమవారం ఈ కార్యాలయాన్ని సీఈ అజయ్కుమార్ ప్రారంభించారు. అలాగే సీఈగా బాధ్యతలను చేపట్టారు.
జిల్లాకో ఎస్ఈ నియామకం
గతంలో ఉమ్మడి జిల్లాకు మైనర్ ఇరిగేషన్ శాఖకు ఒక ఎస్ఈ మాత్రమే ఉండేవారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాల వారిగా నీటిపారుదల శాఖకు ఒక్కో ఎస్ఈని ప్రభుత్వం నియమించింది. సంగారెడ్డి ఎస్ఈగా మురళీధర్, మెదక్ జిల్లా ఎస్ఈగా ఏసయ్యలు నియమితులయ్యారు.
సంగారెడ్డి జిల్లాలో రెండు కొత్త డివిజన్లు
ఇప్పటిదాకా ఒక్కో జిల్లాకు ఇరిగేషన్ అధికారిగా ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) ఉన్నారు. కాగా పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డితో పాటు కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లు ఏర్పాటయ్యాయి. సంగారెడ్డి ఈఈగా ఇప్పటిదాకా ఉన్న మధుసూదన్రెడ్డిని కొనసాగిస్తుండగా జహీరాబాద్ డివిజన్కు సుబ్రహ్మణ్య ప్రసాద్ను నియమించింది. నారాయణఖేడ్ డివిజన్ ఈఈగా ఇంకా ఎవరిని నియమించలేదు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉండే సబ్డివిజన్లు సంగారెడ్డి జిల్లాలో 18 ఉండగా, ఇందులో కొత్తగా ఏర్పాటు చేసినవి 13 ఉన్నాయి. కొత్తగా హత్నూర, దౌల్తాబాద్, మునిపల్లి, మొగుడంపల్లి, హద్నూర, గంగ్వార్, మిర్జాపూర్, ఝరాసంగం, మనూర్, నాగలిగిద్ద, కర్సగుత్తి, నల్లవాగు, వాసర్ సబ్డివిజన్లు ఏర్పాటయ్యాయి. వీటన్నిటికి డీఈఈలను నియమించాల్సి ఉన్నది.
మెదక్ జిల్లాలో కొత్త డివిజన్గా నర్సాపూర్
నర్సాపూర్, జనవరి 11 : నీటి పారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో నర్సాపూర్ సబ్డివిజన్ నుంచి డివిజన్గా మారింది. నర్సాపూర్లో ఈఈ కార్యాలయం ఏర్పాటు కానున్నది. మొన్నటి వరకు తూప్రాన్ కేంద్రంగా డివిజన్ కార్యాలయం ఉండేది. నర్సాపూర్ ఈఈ పరిధిలో ఐదు సబ్డివిజన్లు ఉండనున్నాయి. ఐదుగురు డీఈఈలు రానున్నారు. నర్సాపూర్, కౌడిపల్లి, తూప్రాన్, వెల్దుర్తి, శంకరంపేట (ఆర్) సబ్డివిజన్లుగా ఏర్పాటయ్యాయి. ఒక్కో సబ్డివిజన్ పరిధిలో డీఈఈతో పాటు కొత్తగా ప్రతి సబ్డివిజన్కు ఐదుమంది ఏఈలు నియామకం కానున్నారు. కాగా నర్సాపూర్ సబ్డివిజన్ పరిధిలో నర్సాపూర్, శివ్వంపేట మండలాలు, కౌడిపల్లి సబ్డివిజన్ పరిధిలో కౌడిపల్లి, చిల్పచెడ్ మండలాలు, తూప్రాన్ పరిధిలో తూప్రాన్, మనోరాబాద్ మండలాలు, వెల్దుర్తి సబ్డివిజన్ పరిధిలో వెల్దుర్తి, కొల్చారం మండలాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.