వైద్య ఆరోగ్య శాఖలో 10,028 పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2022-06-07T08:38:04+05:30 IST
వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10,028 ఖాళీల నియామకాలను
ఒకట్రెండు రోజుల్లోనే తొలి ప్రకటన..
తొలుత 1,326 వైద్యుల ఖాళీలకు..!
తర్వాత వారం వారం నోటిఫికేషన్లు
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20ు వెయిటేజీ
నర్సు ఖాళీలకు రాత పరీక్ష: హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10,028 ఖాళీల నియామకాలను వైద్యారోగ్య సేవల నియామక బోర్డు ద్వారా చేపట్టనున్నారు. ఖాళీల భర్తీపై వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లు అనుసరిస్తూ.. న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని ఆదేశించారు. కాగా, తొలుత ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ఐపీఎం విభాగాల్లో 1,326 ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులకు, మిగతా ఉద్యోగాలకు వారం వారం నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. వీటిలో ట్యూ టర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ అర్హత గల ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20% వెయిటేజీ మార్కులు ఇస్తారు. మిగతా 80% ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నిమ్స్లోని ఖాళీలను నిమ్స్ బోర్డు, మిగిలిన పోస్టుల నియామకాలను బోర్డు ద్వారా నిర్వహించాలని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూ టర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లతో పాటు, జీవో నం.34, 35ను సవరించి ఆయుష్ విభాగంలోని స్టాఫ్ నర్సుల ఖాళీలను బోర్డు ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించారు. ఇక ఆయుష్ విభాగంలోని పోస్టుల భర్తీనీ బోర్డు ద్వారానే చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో సేవలందించిన ఔట్సోర్సింగ్ సిబ్బందికి 20ు వెయిటేజీ ఇవ్వాలని మంత్రి సూచించారు. స్టాఫ్ నర్సులను బహుళైచ్చిక పశ్నల రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఆయుష్ వైద్యులను బోధనా సిబ్బందిగా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, వారి స్థానాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇలాంటివారంతా ప్రైవేటు ప్రాక్టీస్ చేయకూడదంటూ సవరణలు చేయాలని మంత్రి నిర్దేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఎం డైరెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. 2, 3 వారాల్లో నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కంటి వైద్యులతో మంత్రి హరీశ్ వర్చువల్ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కాటరాక్ట్ శస్త్రచికిత్సలు నిర్వహిం చాలని ఆదేశించారు. తగిన పరికరాలను వెంటనే సమకూర్చాలని కుటుంబ సంక్షేమ కమిషనర్కు సూచించారు. శిబిరాలు నిర్వహించి, గుర్తించిన రోగులకు అవసరమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.