శ్రామిక్ రైళ్లలో 44 లక్షల మంది వలస కార్మికుల తరలింపు
ABN , First Publish Date - 2020-05-27T07:54:36+05:30 IST
రైల్వే శాఖ మే 1 నుంచి 3,276 శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా 42 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు
- ఐఆర్సీటీసీ 74 లక్షల ఆహార పొట్లాలు,
- కోటికి పైగా వాటర్ బాటిళ్ల పంపిణీ
న్యూఢిల్లీ, మే 26: రైల్వే శాఖ మే 1 నుంచి 3,276 శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా 42 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించింది. ఒక్క 25వ తేదీనే 223 శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 2.8 లక్షల మందిని తరలించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇప్పటికి కూడా రాష్ట్రాల పరిధిలో 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. రైళ్లలో ప్రయాణించిన వలస కార్మికులకు ఐఆర్సీటీసీ 74 లక్షలకు పైగా ఆహార పొట్లాలు, కోటికి పైగా వాటర్ బాటిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. మొత్తం రైళ్లలో 2,875 ఆగిపోగా, 401 రైళ్లు నడుస్తున్నాయి. అత్యధిక రైళ్లను నడిపే మొదటి 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుజరాత్(897), మహారాష్ట్ర (590), పంజాబ్ (358), ఉత్తర ప్రదేశ్ (232), ఢిల్లీ(200) ఉన్నాయి.
ఎక్కువ రైళ్లను నిలిపివేసిన మొదటి 5 రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ (1,428), బిహార్ (1,178), జార్ఖండ్ (164), ఒడిశా (128), మధ్యప్రదేశ్ (120) ఉన్నాయి. వలస కార్మికులను స్వస్థలాలకు పంపడానికి రాష్ట్రాలు కోరినమీదట శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లను నడపడానికి అయ్యే మొత్తం ఖర్చులో 85 శాతం రైల్వే శాఖ భరిస్తుండగా, మిగిలిన 15 శాతం చార్జీల రూపంలో రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. మే 23, 24 తేదీలలో ఉన్న రద్దీ ఇప్పుడు తగ్గిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.