అరేబియా సముద్రంలో అల్పపీడనం
ABN , First Publish Date - 2020-06-01T08:32:24+05:30 IST
ఆగ్నేయ, దానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసరాల్లో ఆదివారం అల్పపీడనం ..
నేడు కేరళకు నైరుతి రుతుపవనాలు
కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
విశాఖపట్నం/అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ, దానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసరాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి సోమవారానికి వాయుగుండంగా మారి ఉత్తర వాయవ్యంగా పయనించి మధ్య అరేబియా సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో కేంద్రీకృతం కానుంది. తరువాత 24గంటల్లో మరింత బలపడే క్రమంలో జూన్ 2న ఉదయం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మూడో తేదీ ఉదయానికి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాల దిశగా పయనిస్తుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల మేరకు తుఫాన్గా మారిన తరువాత తీవ్రతుఫాన్గా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. కాగా, అరేబియా సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా మారింది. ఇప్పటికే కేరళ, కర్ణాటకల్లోని కోస్తా ప్రాంతాలు, లక్షద్వీ్పలో బలమైన గాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమవారం కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇంకా దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ తీర ప్రాంతం, నైరుతి బంగాళాఖాతంలోకి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది. కాగా, అరేబియా సముద్రంలో ఏర్పడనున్న తుఫాన్కు బంగ్లాదేశ్ సూచించిన మేరకు ‘నిసర్గ’ అని పేరు పెట్టనున్నారు. ఉత్తరహిందూ మహాసముద్రం పరిసరాల్లో ఏర్పడే తుఫాన్లకు 13 దేశాల కన్సార్షియం ఖరారు చేసిన పేర్ల జాబితాలో తొలిపేరు ఇది. ఇదిలాఉండగా, జార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితలం నుంచి ఛత్తీ్సగఢ్, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటక, కేరళ మీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా చెప్పారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.