వినాశనమే పాలకుల ధ్యేయం
ABN , First Publish Date - 2021-01-18T09:01:01+05:30 IST
ప్రపంచమంతా అభివృద్ధి.. ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో పాలకులు మాత్రం వినాశనమే ధ్యేయంగా పెట్టుకున్నారని...
ప్రజావేదికతో మొదలైన విధ్వంసం కొనసాగుతోంది
అమరావతి రైతుల ఆవేదన.. 397వ రోజుకు ఆందోళనలు
గుంటూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రపంచమంతా అభివృద్ధి.. ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో పాలకులు మాత్రం వినాశనమే ధ్యేయంగా పెట్టుకున్నారని... ప్రజావేదికతో ఒక్కొక్కటిగా మొదలైన విధ్వంసం ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్నే అధోగతిపాలు చేస్తోందని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్తో ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారానికి 397వ రోజుకు చేరాయి.
శివస్వామికి నోటీసు!
అమరావతి ఉద్యమానికి ప్రజాబలంతో పాటు దైవానుగ్రహం కావాలంటూ తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో తలపెట్టిన శ్రీ విద్యా మహాయాగానికి పోలీసులు అనుమతి లేదన్నారు. రాజధాని అమరావతి ఉద్యమానికి మద్దతుగా గాని, దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గాని, ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతం వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేయటానికి అనుమతి లేదని తెలుపుతూ శివస్వామికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చెపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.