ఆలయాల వివరాలు సమర్పించాలి
ABN , First Publish Date - 2022-06-22T06:33:07+05:30 IST
ఉమ్మడి జిల్లాలోని దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాల వివరాలు, లీజులు, భూములపై సర్వే చేసి నివేదికలను ఏడు రోజుల్లోగా సహాయ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని సర్వే స్పెషల్డ్రైవ్ ప్రత్యేక అధికారి టి వెంకటేశ్ అన్నారు.
- లీజులు, భూముల, ఆస్తులపై సర్వే చేయండి
- ప్రత్యేక అధికారి వెంకటేశ్
కరీంనగర్ కల్చరల్, జూన్ 21: ఉమ్మడి జిల్లాలోని దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాల వివరాలు, లీజులు, భూములపై సర్వే చేసి నివేదికలను ఏడు రోజుల్లోగా సహాయ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని సర్వే స్పెషల్డ్రైవ్ ప్రత్యేక అధికారి టి వెంకటేశ్ అన్నారు. మంగళవారం కరీంనగర్లో ఆయన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆకునూరి చంద్రశేఖర్తో కలసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయాల కింద ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లీజు మొత్తాలను సేకరించాలని పేర్కొన్నారు. ఆలయాలు, మండలాలు, జిల్లాల వారీగా అధికార పరిధిలో ఉన్న అన్ని ఆలయాల డాటాబేస్ రూపొందించాలని అన్నారు. ఇప్పటికీ నోటీఫై చేయని లీజులను సమీక్షించాలని ఆదేశించారు. మెయిన్రోడ్కు ఆనుకొని ఉన్న ఆలయాల భూములను గుర్తించి షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణమండపం, పెట్రోల్ బంక్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. పెండింగ్ కాంట్రిబ్యూషన్లు, ఆడిట్ అభ్యంతరాలు, అన్యాక్రాంతమైన భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని లేదా కేసులు ఫైల్ చేయాలని, హైకోర్ట్, ఇతర కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు కౌంటర్ ఫైల్ చేయాలని అన్నారు. దాతల ద్వారా భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో కార్యాలయ సూపరిండెంట్ నాయిని సుప్రియ, కార్యాలయ సిబ్బంది, వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.