దేవసేనకు కీలక పదవి?

ABN , First Publish Date - 2020-02-23T06:09:09+05:30 IST

నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) చైర్‌పర్సన్‌గా గూడూరు మున్సిపల్‌

దేవసేనకు కీలక పదవి?

నుడా చైర్‌పర్సన్‌గా దేవసేన?

గత హామీ మేరకు సీఎం జగన్ నిర్ణయం

త్వరలో అధికారిక ఉత్తర్వులు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) చైర్‌పర్సన్‌గా గూడూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పొనకా దేవసేన పేరు వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆశీస్సులతో ఈమెకు ఆ పదవి దాదాపుగా ఖరారైనట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం. కాగా, నుడా చైర్మన్‌ స్థానం గత ఏడు నెలలుగా ఖాళీ ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవిపై జిల్లావ్యాప్తంగా పలువురు ఆశలు పెట్టుకున్నారు. నెల్లూరు నగరం నుంచి వైవీ రామిరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన చిరంజీవి రెడ్డి, గూడూరుకు చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వైసీపీ అధిష్ఠానం దేవసేన వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. గతంలో ఈమె తెలుగుదేశం పార్టీ  తరఫున గూడూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.


అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు కౌన్సిలర్లతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈమె పార్టీ మారడం వెనుక మంత్రి అనిల్‌, విజయసాయిరెడ్డిలు కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో ఈమెను పార్టీలోకి ఆకర్షించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా శాసన మండలిని రద్దు చేయడానికి తీర్మానించుకోవడంతో దేవసేనకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో భాగంగా నుడా చైర్‌పర్సన్‌ పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపీలతో కూడా చర్చలు జరిపారని తెలిసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-02-23T06:09:09+05:30 IST