గుడి కాదు అభివృద్ధే మా ఎజెండా: కేంద్ర మంత్రి గడ్కరి

ABN , First Publish Date - 2022-01-08T01:39:56+05:30 IST

మాకు ఎవరిపై వివక్ష లేదు. మెజారిటీ ప్రజల మెప్పు కోసం మేము పాకులాడబోం. ముందుగా చెప్పినట్టే, మా రాజకీయ ఎజెండా అభివృద్ధి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభివృద్ధి అంశం మీదనే రాజకీయం చేస్తాం..

గుడి కాదు అభివృద్ధే మా ఎజెండా: కేంద్ర మంత్రి గడ్కరి

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండా మందిరం కాదని, తమది అభివృద్ధి ఎజెండా అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రామమందిరాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న విమర్శలకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని నవీకరించడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం లాంటివి రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ చేపట్టిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.


ఈ విషయమై నితిన్ గడ్కరిని శుక్రవారం ప్రశ్నించగా ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణం సుప్రీం కోర్టు తీర్పు అనంతరం రాజ్యాంగబద్ధంగా జరుగుతోంది. రామమందిరం అనేది రాజకీయ అంశం కాదు. కానీ, అది చారిత్రక అంశం, అది సాంస్కృతిక అంశం. అయితే బీజేపీ ఇలాంటి అంశాల మీద రాజకీయం చేయదు. మా రాజకీయ ఎజెండా కేవలం అభివృద్ధి. ఈ అంశం మీదనే బీజేపీ రాజకీయం ఉంటుంది’’ అని గడ్కరీ అన్నారు.


అయితే దేశంలోని మెజారిటీ వర్గం మెప్పు పొందడానికి మైనారిటీపై దాడులు జరుగుతున్నాయన్న ప్రశ్నకు గడ్కరీ సమాదానం ఇస్తూ ‘‘మాకు ఎవరిపై వివక్ష లేదు. మెజారిటీ ప్రజల మెప్పు కోసం మేము పాకులాడబోం. ముందుగా చెప్పినట్టే, మా రాజకీయ ఎజెండా అభివృద్ధి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభివృద్ధి అంశం మీదనే రాజకీయం చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో మేం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మా పనితీరును బట్టే ప్రజలను ఓట్లు అడుగుతాం’’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-08T01:39:56+05:30 IST