రామగుండంలో రూ.6కోట్లతో జంక్షన్ల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-01-23T05:57:16+05:30 IST
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో రూ.6కోట్ల వ్యయంతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే చందర్
కోల్సిటీ, జనవరి 22: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో రూ.6కోట్ల వ్యయంతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శనివారం జంక్షన్ల డెవలప్మెంట్పై ఆర్కిటెక్ గులాంకు జంక్షన్లను చూపి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తా, తిలక్నగర్, రమేష్నగర్, ఫైవింక్లయిన్, రాజేష్ థియేటర్, ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్రోడ్డులను సుందరీకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మేయర్ బంగి అనీల్ కుమార్, కమిషనర్ సుమన్రావు, డిప్యూటీ మేయర్ అభిషేక్రావుతో కలిసి ఆయన పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.200కోట్ల ముఖ్యమంత్రి హామి నిధులతో డివిజన్లలో మౌలిక వసతుల కోసం అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సిరిసిల్లా, సిద్ధిపేట, హైదరాబాద్ తరహాలో రామగుండాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, అందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాబోయే తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం జూన్ 2నాటికి కూడళ్ల సుందరీకరణ పూర్తి చేసి ఆహ్లాదంగా మారుస్తామన్నారు. ఈ పరిశీలనలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, శంకర్నాయక్, సాగంటి శంకర్, బొంతల రాజేష్, ఏఈలు జమీల్, షాబాద్, టీఆర్ఎస్ నాయకులు జేవీరాజు, ధరణి జలపతి పాల్గొన్నారు.