యూపీఏ హయాంలో అభివృద్ధి కుంటుపడింది
ABN , First Publish Date - 2022-09-24T08:14:50+05:30 IST
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి.. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ హయాంలో
నిర్ణయాలు తీసుకోవడంలోనూ అలసత్వం
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి
అహ్మదాబాద్: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి.. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ హయాంలో మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుంటు పడ్డాయన్నారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆ ప్రభుత్వం విఫలమైందన్నారు. అహ్మదాబాద్ ఐఐఎంలో విద్యార్థులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మూర్తి ఈ విమర్శలు చేశారు. ప్రస్తుత యువతరమే మన దేశాన్ని చైనాకు దీటైన పోటీదారుగా తీర్చిదిద్దగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
2008-12 మధ్య కాలంలో లండన్లోని హెచ్ఎస్బీసీ బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలి కొద్ది సంవత్సరాల్లో బోర్డు సమావేశాల్లో చైనా గురించి రెండు మూడు సార్లు ప్రస్తావిస్తే భారత్ పేరు ఒకసారైనా వచ్చేదన్నారు. 2012లో తాను హెచ్ఎస్బీసీ బోర్డు నుంచి తప్పుకునే నాటికి మన దేశం పేరే ఎత్తేవారు కాదన్నారు. ‘మన్మోహన్ సింగ్ అసాధారణ వ్యక్తి. ఆయనపై నాకు అమితమైన గౌరవం ఉంది. అయినా ఆయన హయాంలో మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పడకేశాయి. నిర్ణయాలు తీసుకోవడంలోనూ అసాధారణ జాప్యం జరిగేది. కారణం ఏంటో నాకు తెలియదు’ అని నారాయణ మూర్తి అన్నారు. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంతో ప్రస్తుతం ప్రపంచంలో మన గౌరవమూ కొంత పెరిగిందన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు, బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న భారత్లో తయారీ, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు ఇందుకు కారణమని మూర్తి స్పష్టం చేశారు.