యూపీలో ఎస్పీ, బీఎస్పీ పాలనలో కన్నా మా నాలుగేళ్ళ పాలన అత్యుత్తమం : బీజేపీ

ABN , First Publish Date - 2021-06-17T14:55:46+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్

యూపీలో ఎస్పీ, బీఎస్పీ పాలనలో కన్నా మా నాలుగేళ్ళ పాలన అత్యుత్తమం : బీజేపీ

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిపాలన కాలంలో కన్నా ఎక్కువ అభివృద్ధి బీజేపీ నాలుగేళ్ళ పాలనలో జరిగిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా స్థానాలు లభిస్తాయని, మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. 


ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత మౌర్య మీడియాతో మాట్లాడుతూ, ఎస్పీ, బీఎస్పీ 15 సంవత్సరాలు పరిపాలించాయని, ఆ కాలంలో జరిగిన అభివృద్ధిని, తమ పార్టీ పరిపాలిస్తున్న ప్రస్తుత నాలుగేళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధితో పోల్చితే, తమ పార్టీ పాలనలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని తెలిపారు. 2022లో శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా స్థానాలు లభిస్తాయని, మళ్ళీ అధికారాన్ని చేపడుతుందని అన్నారు. అధికారం చేపట్టాలని కలలగంటున్న ప్రతిపక్షాలకు నిరాశ తప్పదని చెప్పారు. 


లోని ప్రాంతంలో ఓ వృద్ధుని గెడ్డం బలవంతంగా కత్తిరించినట్లు వైరల్ అవుతున్న వీడియో గురించి ప్రశ్నించినపుడు మౌర్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేయడం కోసం బూటకపు వీడియోను డిజిటల్ మీడియాలో పెట్టారన్నారు. ముస్లిం మతంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


ఇదిలావుండగా, లోని ప్రాంతంలో జరిగిన సంఘటనకు మతపరమైన కోణం లేదని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ధ్రువీకరించారు. గ్రామీణ ఘజియాబాద్ పోలీసు సూపరింటెండెంట్ ఇరజ్ రజ మాట్లాడుతూ, ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవడంతోపాటు తప్పుడు ఫిర్యాదు చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 


మరోవైపు లోని ప్రాంతంలో జరిగిన సంఘటనపై దుష్ప్రచారం చేసినట్లు ఆరోపిస్తూ ఘజియాబాద్ పోలీసులు మంగళవారం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-06-17T14:55:46+05:30 IST