రూ.121.24 కోట్లతో అభివృద్ధి పనులు
ABN , First Publish Date - 2021-06-23T06:00:20+05:30 IST
చోడవరం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ పరిధిలోని రూ.121.24 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) ప్రసాద్ తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖ డీఈఈ ప్రసాద్
బుచ్చెయ్యపేట, జూన్ 22: చోడవరం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ పరిధిలోని రూ.121.24 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) ప్రసాద్ తెలిపారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో 2021 మార్చి నాటికి రూ.40 కోట్లతో 312 సిమ్మెంట్ రోడ్లు నిర్మించామన్నారు. అలాగే రూ.32 కోట్లతో 84 గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు, రూ.18.09 కోట్లతో రైతుభరోసా కేంద్రాల భవనాలు, రూ.12.77 కోట్లతో 73 ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 85 బల్క్ మిల్క్ కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.13.38 కోట్లు నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఇందులో 35 భవన నిర్మాణాలకు సంబంధించిన స్థలాలకు జియోటాకింగ్ చేసి ఎన్ఎంఆర్ల అంచనాల తయారు చేసి నివేదించామన్నారు. మిగతా 50 భవనాల నిర్మాణాలకు జియోటాకింగ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. రూ.5 కోట్లతో బుచ్చెయ్యపేట మండలం కె.బి.రోడ్డు నుంచి గొన్నవానిపాలెం, రాజుపాలెం రోడ్డు, రావికమతం మండలంలో కోనాడ రోడ్డు, రోలుగుంట మండలంలో రత్నంపేట నుంచి దామునాపల్లి రోడ్డు, చోడవరం మండలంలో ఖండేపల్లి నుంచి దామునాపల్లి రహదారులను తారు రోడ్లుగా అభివృద్ధి చేస్తామని డీఈఈ తెలిపారు.