మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన, ప్రభుత్వ ఏర్పాటుపై ఫడణ్వీస్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-05-28T22:24:28+05:30 IST
ధారావీ, వర్లీ ప్రాంతాల్లో కరోనా మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో కరోనా
ముంబై : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి గానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గానీ తమకు అంత సమయం లేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్వీస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం కరోనాతో క్లిష్ట పరిస్థితిలో ఉందని, దాంతో పోరాడుతున్నామని తెలిపారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ అస్థిరతను తాము ఎంత మాత్రమూ కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. దేశంలోని కరోనా రోగులలో 36 శాతం మంది మహారాష్ట్రకు చెందినవారని, దీనికి కారణం ఉద్ధవ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడమే కారణమని విమర్శించారు.
ధారావీ, వర్లీ ప్రాంతాల్లో కరోనా మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో కరోనా రోగులకు ఆస్పత్రులు, అంబులెన్స్లు అందుబాటులో లేవని, రోడ్డుపైనే రోగులు మరణిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, దీంతోనే ఇబ్బంది తలెత్తుతోందని మండిపడ్డారు. ముంబై మహా నగరంలో ప్రతిసారీ లాక్డౌన్ ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. మూడు కోట్ల మంది దగ్గర రేషన్ కార్డులున్నాయని, అయినా సరే వారికి మార్చి, ఏప్రిల్ మాసంలో రేషన్ లభించలేదని మండిపడ్డారు. తినడానికి తిండి లేకపోవడంతోనే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని ఫడణ్వీస్ తెలిపారు.