నీ రాజీనామా ఎప్పుడు?.. వసంతకు ఉమా సూటి ప్రశ్న
ABN , First Publish Date - 2020-08-04T16:54:07+05:30 IST
అమరావతి తరలిపోతే రాజీనామా చేస్తానన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇప్పుడు మాటమార్చి సీఎం జగన్ నిర్ణయమే
మైలవరం(కృష్ణా): అమరావతి తరలిపోతే రాజీనామా చేస్తానన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇప్పుడు మాటమార్చి సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యం అనడం సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మైలవరం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్నింటా అవినీతికి పాల్పడుతూ బావమరిదితో ఎన్నికల్లో ఖర్చు చేసిన రూ.100 కోట్లు దోచేసి నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశాడని ధ్వజమెత్తారు. కొండపల్లిలో జరుగుతున్న అవినీతి గురించి అడిగిన ఓ వైసీపీ కార్యకర్త చెంపను బావమరిది చెళ్లుమనిపించాడని ఆరోపించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం గవర్నర్ ఆమోదించిన బిల్లు ప్రతుల్ని, సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రతుల్ని దగ్ధం చేశారు. మల్లెల రాధాకృష్ణ, దొండపాటి రాము, బుజ్జి, కాజ, మైకు బాబురావు, డోలానాయక్, జల్లి కృష్ణ పాల్గొన్నారు.