విజ్ఞానగిరిలో భక్తుల పాట్లు

ABN , First Publish Date - 2021-08-03T05:55:48+05:30 IST

ముక్కంటి ఆలయ అనుబంధంగా విజ్ఞానగిరిలో వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆడికృత్తిక ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించడం భక్తులకు ఇబ్బందులు తెచ్చింది.

విజ్ఞానగిరిలో భక్తుల పాట్లు
రోడ్డుపైనే తలనీలాలు సమర్పిస్తున్న భక్తులు

శ్రీకాళహస్తి అర్బన్‌, ఆగస్టు 2: ముక్కంటి ఆలయ అనుబంధంగా విజ్ఞానగిరిలో వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆడికృత్తిక ఉత్సవాలు సోమవారం ఏకాంతంగా నిర్వహించారు. కరోనా ఉధ్రుతితో గత ఏడాది తరహాలో ఈమారు ముక్కంటి ఆలయ యంత్రాంగం ఏకాంతంగానే ఉత్సవాలను నిర్వహించింది. ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఈవో పెద్దిరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని ముక్కంటి ఆలయ యంత్రాంగం నిర్ణయించింది. ఆ మేరకు విస్తృత ప్రచారం చేయక పోవడం సమస్యగా మారింది. ఏటా కావిళ్లతో వేలాదిమంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆంక్షల్లేకుండా ప్రస్తుతం స్వామి సేవలు జరుగుతూ ఉండడంతో, ఆడికృత్తిక వేడుకలు ఘనంగా జరుగుతాయని ఆశించారు. దీంతో సోమవారం వేకువజాము నుంచే పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. కొండపైకి అనుమతించక పోవడంతో, కిందిభాగంలో వెలసిన వినాయకస్వామికి భక్తులు కర్పూర హారతులు సమర్పించి వెనుదిరిగారు. కల్యాణకట్ట ఉంటుందని ఆశించినా, ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశ చెందారు. ఈమారు ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహించడంతో, రోడ్డుపైనే భక్తులు తలనీలాలు సమర్పించాల్సి వచ్చింది. 

Updated Date - 2021-08-03T05:55:48+05:30 IST