కొండపోచమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-01-19T05:52:49+05:30 IST
కొండపోచమ్మా.. కరుణించమ్మా...
అలరించిన శివ సత్తుల సిగాలు.. పోతరాజుల విన్యాసాలు... పత్యేక ఆకర్షణగా లష్కర్ బోనాలు
జగదేవ్పూర్, జనవరి 18: కొండపోచమ్మా.. కరుణించమ్మా... అంటూ వేలాది మంది భక్తుల మధ్య శివ సత్తుల సిగాలు.. పోతరాజుల విన్యాసాలతో మండలంలోని తీగుల్నర్సాపూర్ గ్రామ సమీపంలోని కొండపోచమ్మ ఆలయ పరిసరాలు మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా కొండపోచమ్మ ఆలయానికి తండోపతండాలుగా బయలెల్లి వచ్చారు. కొండ పోచమ్మ ఆలయం జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం జాతరకు భక్తులు సుమారు 50 వేల పైగా తరలివచ్చారు. సోమవారం కంటే మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒగ్గు కళాకారుల, పోతరాజు నాట్యాలు, శివసత్తుల శివగాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి గుడికి కిలోమీటర్ దూరం నుంచి భక్తులు బోనాలను నెత్తిన ఎత్తుకొని లయబద్దంగా నాట్యం చేస్తూ అమ్మవారి చెంతకు చేరుకున్నారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనం సమర్పించి, కొబ్బరికాయలతో ముడుపులు కట్టారు. సికింద్రాబాద్ నుంచి వచ్చిన భక్తులు చేసిన లష్కర్ బోనాలు జాతరలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రజితరమేష్ జాగ్రత్తలు తీసుకున్నారు. రెండోవారం భక్తుల సంఖ్య పెరుగుతుందని వారు తెలిపారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో ధూంధాం
అంబర్పేట యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బోనాల ధూంధాం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై కళాకారులచే ఆటపాట నిర్వహించారు. తెలంగాణ పండుగ పోచమ్మ అంటూ ప్రత్యేకంగా శివసత్తుల శిగాలు, పోతరాజులు ప్రదర్శనలిచ్చారు భక్తులు మంగళవారం సాయంత్రం పట్నం బాటపట్టారు. ఆది, సోమవారాల్లో మల్లన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం వేల సంఖ్యలో కొండపోచమ్మ వద్దకు చేరుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వన భోజనాలు చేసుకొని సాయంత్రం వాహనాల్లో పట్నం బాట పట్టారు.