మధురలో రావణాసురునికి పూజలు

ABN , First Publish Date - 2021-10-16T02:40:38+05:30 IST

రావణాసురునిపై శ్రీరాముడి విజయాన్ని దేశమంతటా దసరా

మధురలో రావణాసురునికి పూజలు

మధుర : రావణాసురునిపై శ్రీరాముడి విజయాన్ని దేశమంతటా దసరా సందర్భంగా జరుపుకుంటూ ఉంటే, ఉత్తర ప్రదేశ్‌లోని యమునా నది ఒడ్డునగల ఓ శివాలయంలో రావణాసురుడికి వేద మంత్రాలు, శంఖ ధ్వని నడుమ పూజలు జరిపారు. రావణాసురుడి బొమ్మను దహనం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లంకేష్ మిత్ర మండల్ కోరింది.


లంకేష్ మిత్ర మండల్ జాతీయ అధ్యక్షుడు ఓమ్‌వీర్ సారస్వత్ మాట్లాడుతూ, దేశ రాజధాని నగరం ఢిల్లీ, పరిసరాలను కలుషితం చేస్తున్న పంట దుబ్బుల కాల్చివేతను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అదేవిధంగా రావణాసురుడి బొమ్మను దహనం చేయకుండా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. రావణాసురుడి బొమ్మను దహనం చేయడం వల్ల కూడా పర్యావరణం కలుషితమవుతుందన్నారు. ఈ బొమ్మలను దహనం చేయడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి తాము భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తామని తెలిపారు. 


సీతా దేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోవడం క్షమించదగినదేనని చెప్పారు. తన సోదరి శూర్పణఖను లక్ష్మణుడు అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఆమెను ఎత్తుకెళ్ళాడన్నారు. శ్రీరామునికి రావణాసురుడు పురోహితుడిగా వ్యవహరించి, ఆయన విజయం సాధించాలని ఆశీర్వదించాడన్నారు. రావణాసురునికి పూజలు చేయడానికి ముందు తాము శివునికి పెరుగు, పాలు, తేనె, నెయ్యి, ఖండసారిలతో అభిషేకం చేశామన్నారు. 


జిల్లా కలెక్టర్ నవనీత్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఏడాది కోవిడ్-19 మహమ్మారి నిరోధక ఆంక్షలు అమలవుతుండటం వల్ల మధురలోని రామలీల మైదానంలో రావణాసురుడు, మేఘనాథుల బొమ్మలను దహనం చేయలేదన్నారు. 


Updated Date - 2021-10-16T02:40:38+05:30 IST