డీజీపీ నాకు లేఖ రాయడం హాస్యాస్పదం: బాబు
ABN , First Publish Date - 2020-09-29T23:45:54+05:30 IST
సీల్డ్కవర్లో సాక్ష్యాధారాలు పంపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తనకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. తాను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట..
అమరావతి: సీల్డ్కవర్లో సాక్ష్యాధారాలు పంపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తనకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. తాను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట.. ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా? అని ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. వైసీపీ అవినీతి కుంభకోణాలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. ఆలయాలు, దళితులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.
జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడికి రాజకీయాలతో సంబంధం లేదని మొదట ఎస్పీ చెప్పారని, దాడి జరిగిన రోజు కుమార్రెడ్డితో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేశారని తెలిపారు. సాయంత్రానికల్లా కుమార్రెడ్డి పేరుకు బదులు ప్రతాప్రెడ్డి పేరు తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ స్థానంలో టీడీపీని చేర్చారని, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో ఇదే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. వైసీపీ నేతలపై సీఎం జగన్ బంధువులపై కేసులు ఎత్తేస్తున్నారని, ఏ నేరం చేయకున్నా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ భజన-చంద్రబాబును దూషించడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, జగన్ అలుసు చూసుకునే నేరస్థులు పేట్రేగిపోతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.