కొవిడ్ ముప్పు తొలగలేదు
ABN , First Publish Date - 2020-11-22T09:26:06+05:30 IST
వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వైరస్ ముప్పు మాత్రం తొలగలేదని, మరో రెండు నెలలు ప్రజలు జాగ్రత్తలు ..
మరో 2 నెలలు జాగ్రత్తల పాటింపు కీలకం
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అప్రమత్తత
6 నుంచి 3.8కి తగ్గిన పాజిటివ్ రేటు
డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి
హైదరాబాద్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వైరస్ ముప్పు మాత్రం తొలగలేదని, మరో రెండు నెలలు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తప్పకుండా మాస్క్లు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. శనివారం కోఠిలోని కార్యాలయంలో వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీలో ప్రచారానికి బయటకు వచ్చేవారంతా మాస్క్ ధరించాలని, ఆ బాధ్యత రాజకీయ నాయకులే తీసుకోవాలన్నారు. వైరస్ లక్షణాలు స్పల్పంగా ఉన్నా టెస్టులు చేయించుకోవాలని, ప్రచారానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
హైదరాబాద్లో 1.12 లక్షల కేసులు
తెలంగాణలో నవంబరు నెలలో చాలా తక్కువ కేసులు వచ్చాయని శ్రీనివాసరావు తెలిపారు. పాజిటివ్ రేటు 6 నుంచి 3.8కి తగ్గిందన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కేసులు తక్కువేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల పరీక్షలు చేయగా, 2.62 లక్షలు కేసులు నమోదయ్యాయని, అందులో హైదరాబాద్లోనే 1,12,892 కేసులు వచ్చినట్లు వెల్లడించారు.
సీరో సర్వేలతో ఫలితం లేదు
ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రులు ముందుకొస్తే అనుమతి ఇస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. సీరో సర్వేలతో ఉపయోగం లేదని, అందుకే వాటి జోలికి వెళ్లడం లేదని వివరించారు. సెకండ్ వేవ్ను ఎదుర్కొనేలా జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపి ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్ రమేశ్రెడ్డి వెల్లడించారు. ఆస్పత్రుల్లో నాన్ కొవిడ్ ేసవలు ప్రారంభిస్తున్నామన్నారు.