క్షమాపణ చెబుతూనే కౌంటరిచ్చిన ధర్మారెడ్డి

ABN , First Publish Date - 2021-10-07T20:49:01+05:30 IST

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం.. వివాదం ముదిరిన తర్వాత క్షమాపణ చెప్పడం అనేక సార్లు మనం విన్నాం.

క్షమాపణ చెబుతూనే కౌంటరిచ్చిన ధర్మారెడ్డి

హన్మకొండ: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం.. వివాదం ముదిరిన తర్వాత క్షమాపణ చెప్పడం అనేక సార్లు మనం విన్నాం. ఇప్పుడు కూడా క్షమాపణ చెబుతూనే కౌంటరిచ్చేందుకు ప్రయత్నించారు. బతుకమ్మలపై నుంచి తన కారు వెళ్లిన ఘటనపై చల్లా ధర్మారెడ్డి స్పందించడంతో పాటు విమర్శలకు కౌంటరిచ్చారు. తాను ఆ సమయంలో కారులో లేనని, నడుచుకుంటూనే వెళ్లానని తెలిపారు. తన కారు డ్రైవర్‌పై కొందరు కావాలనే దాడి చేశారని విమర్శించారు. కొందరు కావాలనే తనపై బురదజల్లుతున్నారని దుయ్యబట్టారు. మహిళల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరతామని చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. 


వరంగల్ జిల్లా ఆత్మకూరులో పోచమ్మ సెంటర్‌ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న సర్పంచ్‌ పర్వతగిరి రాజు ఓ పక్క నుంచి ఎమ్మెల్యే కారు పోనివ్వండిని ప్రాధేయపడ్డా పోలీసులు, అనుచరులు వినిపించుకోలేదు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి కారును గ్రామస్థులు, మహిళలు అడ్డుకుని  ఆయనకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  గ్రామస్థులను పోలీసులు తోసేయడంతో కొందరు సోమ్మసిల్లి కిందపడిపోయారు. 

Updated Date - 2021-10-07T20:49:01+05:30 IST