క్లీనిక్ ముందు శవంతో ధర్నా
ABN , First Publish Date - 2020-08-04T10:37:31+05:30 IST
మండలంలోని ఉద్దేహాళ్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని ద్విచక్రవాహనం ఢీకొని నాగరాజు (31) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.
బొమ్మనహాళ్, ఆగస్టు 3 : మండలంలోని ఉద్దేహాళ్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని ద్విచక్రవాహనం ఢీకొని నాగరాజు (31) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం మృతుడి బంధువులు మృతదేహానికి పోస్టుమార్టమ్ అనంతరం ఉద్దేహాళ్లోని వైద్యాధికారి శ్రావణ్కుమార్కు చెందిన క్లినిక్ ముందు ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి మూత్రవిసర్జన కోసం వెళ్లిన నాగరాజును శ్రావణ్ కుమార్కు చెందిన ద్విచక్రవాహనంతోనే రాము అనే వ్యక్తి ఢీకొట్టాడని ఈ విషయం సోమవారం ఉదయం గుర్తించినట్లు బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రమణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులతో ధర్నా విరమించేందుకు ప్రయత్నం చేశారు.
వారు ససేమిరా అంటూ ధర్నాను కొనసాగించారు. మృతుడి భార్య, పిల్లలతో కలసి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. వైద్యుడు శ్రావణ్కుమార్కు సంబంధించిన వాహనం కాదు ఏపీ 02 బీయు 0428 నెంబర్గల ద్విచక్రవాహనం శ్రీకాంత్ అనే అబ్బాయి పేరుపై ఉందని, దీనిపై విచారించి వాహన యజమానిపై, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమణారెడ్డి అన్నారు. వైద్యాధికారి శ్రావణ్కుమార్ ఎప్పుడూ క్లీనిక్లో ఉంటూ ఇతరులతో తన పనిపైనే పంపించి నాగరాజు మరణానికి కారణమయ్యాడని బంధువులు ఆరోపించారు. కొందరు గ్రామపెద్దలు జోక్యం చేసుకుని కుటుంబానికి రూ.2 లక్షలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.