గుజరాతీ పల్లెలో ‘డిజిటల్ సంతాప సభ’

ABN , First Publish Date - 2020-03-27T02:54:09+05:30 IST

సాటి మనిషి దుఃఖంతో కుమిలిపోతున్నపుడు, చేరువగా వెళ్ళి, ఓదార్చి, సాంత్వన వచనాలు పలికే అవకాశం లేకుండా కరోనా వైరస్ మహమ్మారి అడ్డుకుంటోంది.

గుజరాతీ పల్లెలో ‘డిజిటల్ సంతాప సభ’

అహ్మదాబాద్ : సాటి మనిషి దుఃఖంతో కుమిలిపోతున్నపుడు, చేరువగా వెళ్ళి, ఓదార్చి, సాంత్వన వచనాలు పలికే అవకాశం లేకుండా కరోనా వైరస్ మహమ్మారి అడ్డుకుంటోంది. అయితే కష్టంలో ఉన్నవారికి వారి బంధు, మిత్రులు, శ్రేయోభిలాషులు అండగా నిలిచేందుకు సామాజిక మాధ్యమాలు ఆసరాగా నిలుస్తున్నాయి. 


దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్న సమయంలో బుధవారం గుజరాత్‌లోని పన్సరీ అనే గ్రామంలో జయంతిబాయి దర్జి (60) మరణించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తుందనే ఆందోళనతో సామాజిక దూరం పాటించవలసి ఉండటంతో, మృతుని బంధువులకు అండగా నిలవాలని మనసులో ఉన్నా, వారి బంధు, మిత్రులు, శ్రేయోభిలాషులకు అందుకు అవకాశం లేకపోయింది. వీరంతా తమ తమ ఇళ్ళకే పరిమితం కావలసి వచ్చింది.


పన్సరీ మన దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ విలేజ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఉచిత వైఫై, సీసీటీవీ నిఘా వంటి అత్యాధునిక సదుపాయాలను అమలు చేసి, అందరి మన్ననలు పొందుతోంది. 


పన్సరీ గ్రామ మాజీ సర్పంచ్ హిమాంశు పటేల్‌ మాట్లాడుతూ తాను మృతుని సోదరుడు నటుబాయితో మాట్లాడానని, జయంతిబాయి మరణం నేపథ్యంలో సంతాప సభకు బదులుగా ‘డిజిటల్ సంతాప సభ’ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చానన్నారు. 


దర్జీ కుటుంబ సభ్యులు ఈ సలహాను ఆమోదించడంతో, జయంతిబాయి దర్జీ ఇంటి బయట డిజిటల్ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఓ బల్లపై ఆయన ఫొటో, దాని పక్కనే ఓ ల్యాప్‌టాప్, కెమెరా ఏర్పాటు చేశారు. ఆ ఫొటో ముందు ఐదుగురు కుటుంబ సభ్యులు మాత్రమే కూర్చున్నారు. ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. జయంతిబాయి కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు, శ్రేయోభిలాషులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నివాళులు అర్పించాలని కోరారు. ముంబైలో ఉంటున్న దర్జీ కుమారుడు, అహ్మదాబాద్‌లో ఉంటున్న ఆయన కుమార్తె సహా సుమారు 300 మంది ఈ విధంగా నివాళులు అర్పించారు. 


కోవిడ్-19 మహమ్మారి వ్యాపించకుండా నిరోధించాలంటే సామాజిక దూరం పాటించవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇటువంటి పద్ధతులను అనుసరిస్తూ, మనుషులు దూరంగా ఉన్నా, మనసులు చేరువయ్యేలా చేసుకోవచ్చు. 


Updated Date - 2020-03-27T02:54:09+05:30 IST