డైనోసార్కు క్యాన్సర్.. తొలిసారి గుర్తించిన శాస్త్రవేత్తలు!
ABN , First Publish Date - 2020-08-04T20:55:10+05:30 IST
ఓ శాకాహార డైనోసార్కు చెందిన శిలాజంలో శాస్త్రవేత్తలు తొలిసారిగా క్యాన్సర్ కణితిని గుర్తించారు.
న్యూఢిల్లీ: ఓ శాకాహార డైనోసార్కు చెందిన శిలాజంలో శాస్త్రవేత్తలు తొలిసారిగా క్యాన్సర్ కణితిని గుర్తించారు. ఏడున్నకొట్ల సంవత్సరాల క్రితం తిరుగాడిన ఈ రాక్షసబల్లి పేరు సెంట్రోసారస్ అని వారు తెలిపారు. వాస్తవానికి దీని శిలాజాన్ని శాస్త్రవేత్తలు చాలా కాలం క్రితమే గుర్తించారు. ఆ సమయంలోనే వారు ఆ డైనోసార్ కాలి ఎముకలో ఆపిల్ పండు మందాన ఓ కణితిని గుర్తించారు. అయితే అది విరిగిన ఎముక కోలుకునే క్రమంలో ఏర్పడి ఉంటుందని అప్పట్లో వారు భావించారు. కానీ ఇటీవల జరిపిన పరీక్షల్లో అది క్యాన్సర్ కణితిగా తేలింది. ఆస్టియోసార్కోమా అనే ఎముక క్యాన్సర్ కారణంగా ఈ కణితి ఏర్పడిందని పరిశోధకులు తెలిపారు. ఓ డైనోసార్లో క్యాన్సర్ కణితిని గుర్తించడం ఇదే తొలసారని వారు వ్యాఖ్యానించారు.
కాగా.. ఈ శిలాజాన్ని శాస్త్రవేత్తలు కెనడాలోని డైనోసార్ ప్రోవిన్షియల్ పార్క్లో 1989లో తొలిసారి గుర్తించారు. ఇంతటి భయానక జీవులు కూడా మనుషుల వలె అనేక శారీరక రుగ్మతలతో బాధపడేవన్న విషయాన్ని ఈ ఫలితం మరోసారి రుజువు చేసిందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. క్యాన్సర్లు మృదువైన కణజాలంలోనే ఎక్కవగా ఏర్పడటంతో మృతదేహం శీలాజంగా మారే క్రమంలోనే అదృమైపోతాయని వారు అన్నారు. ఈ కారణంగానే డైనోసార్ శాలిజాల్లో క్యాన్సర్ను గుర్తించడం చాలా అరుదని తెలిపారు.