క్రమశిక్షణ,ఐక్యతతోనే పార్టీ పటిష్టత: సోనియాగాంధీ

ABN , First Publish Date - 2021-10-26T19:10:07+05:30 IST

విధానపరమైన అంశాల విషయంలో పార్టీ రాష్ట్ర నేతల్లో స్పష్టత లోపించినట్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు..

క్రమశిక్షణ,ఐక్యతతోనే పార్టీ పటిష్టత: సోనియాగాంధీ

న్యూఢిల్లీ: విధానపరమైన అంశాల విషయంలో పార్టీ రాష్ట్ర నేతల్లో స్పష్టత లోపించినట్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీ పటిష్టత ముఖ్యమని, క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


పార్టీ చేపట్టాల్సిన న్యూ మెంబర్‌షిప్ డ్రైవ్‌, అందుకు అనుసరించాల్సిన విధివిధానాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ 1న కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.


బీజేపీ, ఆర్ఎస్ అబద్ధాలను ఎండగడదాం..

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దుష్ప్రచారాలపై తప్పనిసరి పోరాటం సాగించాలని సోనియాగాంధీ తన ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ యుద్ధంలో గెలవాలంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, ఎండగట్టాలని అన్నారు. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త సభ్యులే కీలకమైనే విషయాన్ని పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు గుర్తించాలని అన్నారు. వారందరికీ ఒక వేదిక కల్పించాలని అన్నారు. దశాబ్దాల తరబడి పార్టీ ఇదే బాటలో నడుస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యకర్తలను గుర్తించి, ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ 'అకృత్యాల' బాధితుల తరఫున రెట్టించిన ఉత్సాహంతో పోరాటం సాగించాలని అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగావకాశాల కోసం పోరాడుతున్న యువత, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, మన సోదర, సోదరీమణులు, ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి సారించాలని నేతలకు సోనియాగాంధీ పిలుపునిచ్చారు.


రాష్ట్ర నేతల్లో అవగాహనా లేమి...

కీలకాంశాలపై పార్టీ వైఖరికి చెందిన సమాచారం అట్టడుగు స్థాయి కార్యకర్తల వరకూ వెళ్లడం లేదని సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర నేతల మధ్య అవగాహనా లేమి, సయోధ్య లేమి కనిపిస్తోందని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి అని, వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీ పటిష్టతే మిన్న అని అన్నారు.


మోదీ సర్కార్‌పైనా సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. కీలక వ్యవస్థలకు గండికొడుతూ, జవాబుదారీతనానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోందని అన్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో కలిసికట్టు పోరాటానికి పార్టీ కార్యకర్తలు, నేతలు సిద్ధం కావాలని, సమాజంలోని అన్నివర్గాల ఆకాంక్షలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన విధానాలు, కార్యక్రమాలతో పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు.

Updated Date - 2021-10-26T19:10:07+05:30 IST