ఈ కంపెనీల్లో వ్యూహాత్మక అమ్మకాలు... త్వరలో మంత్రివర్గం అనుమతి కోసం ?
ABN , First Publish Date - 2021-12-08T00:32:04+05:30 IST
నేషఫనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో), హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(హెచ్సీఎల్)లలో స్టేక్ సేల్ వేగవంతం కానుంది.
ముంబై : నేషఫనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో), హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(హెచ్సీఎల్)లలో స్టేక్ సేల్ వేగవంతం కానుంది. ఈ రెండు కంపెనీల్లో వ్యూహాత్మక అమ్మకాల కోసం డిజ్ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ త్వరలోనే క్యాబినెట్ అనుమతి కోరనున్నట్లు వినవస్తోంది. గనుల మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లియరెన్స్కు పంపడం జరగుతుందని ఓ అధికారి వెల్లడించారు. కాగా... ఈ నేపధ్యంలో... ఈ కమోడిటీస్లో ర్యాలీ కనిపించే అవకాశముంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే క్యాబినెట్ ఆమోదం సహా అన్ని అనుమతులనూ పూర్తి చేసుకుని, వాటాను రానున్న సంవత్సరంలో విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. హిందుస్థాన్ కాపర్లో 66.14 %, నాల్కోలో 51.28 % వాటాలు ప్రస్తుతం ప్రభుత్వానికున్నాయి. ఈ రెండు కంపెనీల్లో స్టేక్ అమ్మేసి, మిగిలిన కొద్దిమొత్తాన్ని తన వద్దే కేంద్రం అట్టిపెట్టుకోవచ్చని సమాచారం.
హిందుస్థాన్ కాపర్పై ఇన్వెస్టర్ల ఆసక్తి...
హిందుస్థాన్ కాపర్లో వాటాల కొనుగోలుకు వేదాంత గ్రూప్ సహా ఇతరత్రా పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాగా... నిన్న(సోమవారం) నాల్కో రూ. 90.45 వద్ద ముగిసింది. ఆ రేటు వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ. 16,580 కోట్లు. ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 196.90 గరిష్ట స్థాయికి చేరిన హిందుస్థాన్ కాపర్, అక్కడి నుంచి తగ్గింది. ప్రస్తుతం, గ్లోబల్ అల్యూమినియం, రాగి ధరల్లో కొంత దిద్దుబాటు కనిపిస్తోంది, రికవరీలో వేగం పెరిగితే, ఈ స్టాక్స్ మళ్లీ పుంజుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పదిహేడు వ్యూహాత్మక లావాదేవీలు ట్రాన్జాక్షన్లు ప్రాసెస్లో ఉన్నాయని ప్రభుత్వం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ & డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ (ఇండియా) లిమిటెడ్, బీఈఎంఎల్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.75 లక్షల కోట్ల ‘వాటాల ఉపసంహరణ’ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ క్రమంలోనే... ఆయా సంస్థల్లో వాటాలను విక్రయించుకుంటూ వస్తోంది.