ఊరెళ్లిన జనం.. బోసిపోయిన భాగ్యనగరం..

ABN , First Publish Date - 2022-01-14T09:09:15+05:30 IST

రాష్ట్ర రాజధానినగరంలో..

ఊరెళ్లిన జనం.. బోసిపోయిన భాగ్యనగరం..

  • 3 రోజులుగా రద్దీగా స్టేషన్లు, బస్టాండ్లు
  • హైదరాబాద్‌ రహదారుల్లో తగ్గిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌ సిటీ, చౌటుప్పల్‌ టౌన్‌/రూరల్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానినగరంలో.. రహదారులపై ట్రాఫిక్‌ తగ్గింది! ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల మోతతో దద్దరిల్లే రహదారులు బోసిబోయి కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ పెట్టినట్టుగా.. పలు కాలనీలు నిర్మానుష్యంగా మారాయి!! రోడ్ల వెంట తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు గిరాకీ కోసం పడిగాపులు కాస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలోని వలసజీవుల్లో చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో రెండురోజులుగా కనిపిస్తున్న పరిస్థితి ఇది. నాలుగు రోజుల క్రితం వరకూ.. ఐటీ కారిడార్‌లోని రోడ్లపై నిమిషానికి వేలాది వాహనాలు రాకపోకలు సాగించిన పరిస్థితి ఉండగా.. గురువారం పదుల సంఖ్యలోనే కనిపించాయి. సాధారణంగా నగర రోడ్లపై ప్రతి రోజూ సగటున 50 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. అయితే గురువారం వాటి సంఖ్య 25 లక్షలకు తగ్గిందని.. శుక్ర, శనివారాల్లో 20 లక్షల లోపే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్‌ తగ్గిపోవడంతో వాహనదారులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగమూ తగ్గింది. 


సాధారణ రోజుల్లో నిత్యం 55 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం ఉంటుంది. నాలుగైదు రోజులుగా విద్యుత్‌ వినియోగం 47 మిలియన్‌ యూనిట్లలోపే ఉంటోంది. ఇక.. మెట్రో రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ రెండు రోజులుగా భారీగా తగ్గింది. నగర పరిధిలోని నాగోలు-రాయదుర్గం, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌, ఎల్‌బీ నగర్‌-మియాపూర్‌ మార్గాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 11.15 వరకు 66 స్టేషన్ల నుంచి రోజుకు 820 ట్రిప్పులను నడిపిస్తున్నారు. ఈ మూడు కారిడార్ల పరిధిలో రోజుకు సగటున 2.50 నుంచి 2.70 లక్షల మంది ప్రయాణిస్తారు. బుధ, గురువారాల్లో ఆ సంఖ్య 1.5 లక్షలకు తగ్గింది. అయితే.. పండుగకు ఊరెళ్లే వాహనాలన్నీ సాఫీ ప్రయాణం కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఎంచుకుంటుండడంతో గత నాలుగైదు రోజులుగా ఓఆర్‌ఆర్‌పై మాత్రం వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఐదు రోజుల్లో పది లక్షల వాహనాలు ఔటర్‌పై అదనంగా ప్రయాణం చేసినట్టు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు 1.2 లక్షల వాహనాలు ప్రయాణిస్తాయి. కానీ, రెండు, మూడు రోజులుగా.. 2లక్షల నుంచి 3లక్షల మేర వాహనాలు అదనంగా వెళ్లాయని, శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.


అక్కడ మాత్రం కిటకిట..

నగరంలోని రహదారులపై రద్దీ తగ్గినా.. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు మాత్రం కిటకిటలాడిపోతున్నాయి. గురువారం నగర పరిధిలోని సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి 3.30 లక్షల మంది తరలివెళ్లినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బస్సుల ద్వారా 1.80 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు. అటు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైనా రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌గేటు వద్ద విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. గురువారం ఒక్క రోజే 50వేలకు పైగా వాహనాలు వెళ్లాయి.


అధ్వానంగా ప్రత్యేక రైళ్ల నిర్వహణ

దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఉదాహరణకు.. గురువారం నాంపల్లి నుంచి కాకినాడకు వెళ్లిన సువిధ స్పెషల్‌ రైలులో ఏసీ టూ, త్రీ టైర్‌ కోచ్‌లో విద్యుత్‌ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. అరగంట దాటినా కరెంట్‌ రాకపోవడంతో ప్రయాణికులు రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రీషీయన్లు వచ్చి పరిశీలించినా విద్యుత్‌ను పునరుద్ధరించలేకపోయారు. 


‘ప్రైవేట్‌’ దోపిడీ!

పండక్కి సొంతూరికి వెళ్లాలన్న నగరవాసుల కోరికను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేటు బస్సుల్లో చార్జీలను సాధారణ రోజుల్లో కంటే 40 నుంచి 50 శాతం మేర పెంచేయడంతో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఇప్పటికే నిండిపోవడంతో వేరేమార్గం లేక వాటిలో ప్రయాణిస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు నాన్‌ ఏసీ బస్సులో టికెట్‌ ధర రూ.500 ఉండగా.. ఇప్పుడు రూ.1000 వసూలు చేస్తున్నారు. కాకినాడకు రూ.750 ఉంటే ఇప్పుడు రూ.1300 తీసుసుకుంటున్నారు. కొంతమంది ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు బస్సులో 30ు సీట్లను ఆన్‌లైన్‌లో పెట్టి, మిగతా వాటిని స్పాట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

Updated Date - 2022-01-14T09:09:15+05:30 IST