ఆసక్తిగా అశ్వాల పారువేట
ABN , First Publish Date - 2021-10-17T05:06:37+05:30 IST
అశ్వాల పారువేటలో యమన్ననగిరి రాజు విజయం సాధించారు.
యమన్ననగిరి రాజుల విజయం
మద్దికెర, అక్టోబరు 16: అశ్వాల పారువేటలో యమన్ననగిరి రాజు విజయం సాధించారు. మద్దికెర విజయదశమి సందర్భంగా పెద్దనగిరి, చిన్ననగిరి, యమన్ననగిరి యాదవరాజులు శుక్రవారం అశ్వాల పారువేటలో పాల్గొన్నారు. గ్రామ శివారులోని బోజప్పబావి వద్ద అశ్వాలను ఉదయం శుభ్రం చేసి తీసుకువచ్చారు. మూడు కుటుంబాల వారు సాయంత్రం రాజుల దుస్తులను ధరించి సైన్యంతో బయలుదేరారు. బొజ్జనాయనపేటలో తమ పూర్వీకులు నిర్మించిన బోగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అశ్వాల పోటీలు మొదలయ్యాయి. నాలుగు కిలోమీటర్ల మేర గుర్రపు స్వారీ చేశారు. యమన్ననగిరికి చెందికి శశివర్ధన్రాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ద్వితీయస్థానంలో చిన్ననగిరి, తృతీయస్థానంలో పెద్దనగిరి అశ్వాలు నిలిచాయి. తరతరాలుగా సాగుతున్న అశ్వాలపారువేటను గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. గెలుపొందిన అశ్వం మీద రాజులను ఊరేగించారు. యాదవ కుటుంబానికి చెందిన 16 ఏళ్ల యువకుడు శశివర్ధన్ రాయుడు చిన్న వయస్సులోనే అశ్వాల పారువేటలో పాల్గొని విజయం సాధించడంతో పలువురు అభినందించారు.