బాకీ గొడవ

ABN , First Publish Date - 2020-08-04T11:34:40+05:30 IST

వ్యాపార లావాదేవీల కారణంగా రెండు మత్స్యకార గ్రామాల మధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది.

బాకీ గొడవ

 రెండు మత్స్యకార గ్రామాల మధ్య ఘర్షణ

వ్యాపార లావాదేవీలతో తలెత్తిన వివాదం

భైరవపాలెంలో ఉద్రిక్తత


ఐ.పోలవరం, ఆగస్టు 3: వ్యాపార లావాదేవీల కారణంగా రెండు మత్స్యకార గ్రామాల మధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది. ఐ.పోలవరం మండలం భైరవపాలెం, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామాల మత్స్యకారుల మధ్య వ్యాపార లావాదేవీల కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. భైరవపాలెం గ్రామానికి చెందిన వ్యాపారి బలుసుతిప్ప మత్స్యకారులకు రూ.15లక్షలు బాకీ పడి ఉన్నాడు. దీంతో వారంతా బోట్లు ద్వారా బాకీ కోసం సోమవారం భైరవపాలెం గ్రామానికి చేరుకున్నారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం గ్రామానికి చెందిన వ్యాపారిని నిలదీయడంతో వివాదం ఏర్పడింది. కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కారణంగా చెన్నైకు చెందిన కంపెనీవద్ద డబ్బులు ఆగిపోయాయని సదరు వ్యాపారి చెప్పడంతో బలుసుతిప్ప మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సమయంలో ఇరుగ్రామాల మత్స్యకారుల మధ్య బాకీకోసం ఏర్పడిన వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారు. తొలుత భైరవపాలెం వ్యాపారికి చెందిన బోట్లు తీసుకుపోయేందుకు బలుసుతిప్ప మత్స్యకారులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ ప్రారంభించారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలైన భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై ఐ.పోలవరం ఎస్‌ఐ ఎస్‌.రామును వివరణ కోరగా విచారణ చేస్తున్నామన్నారు.


Updated Date - 2020-08-04T11:34:40+05:30 IST