15 నుంచి రైతుబంధు నిధుల పంపిణీ!

ABN , First Publish Date - 2021-12-06T08:08:13+05:30 IST

యాసంగి సీజన్‌ రైతుబంధు నిధులను ఈ నెల 15వ తేదీ నుంచి పంపిణీ చేేస అవకాశాలున్నాయి.

15 నుంచి రైతుబంధు నిధుల పంపిణీ!

  • రూ.7,500 కోట్ల విడుదలకు ప్రభుత్వ ఆదేశం
  • రైతుల ఖాతాల్లో జమకు అధికారుల సన్నాహాలు

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌ రైతుబంధు నిధులను ఈ నెల 15వ తేదీ నుంచి పంపిణీ చేేస అవకాశాలున్నాయి. ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు... నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి... అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్మును జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధులను పంపిణీ చేశారు. అయితే యాసంగి సీజన్‌లో నిధుల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే, రైతుబంధు బడ్జెట్‌ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరం ఉంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. గత వానాకాలం సీజన్‌లో... మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి... ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో రైతుబంధును పంపిణీ చేేసందుకు అధికారులు సిద్థమవుతున్నారు.

Updated Date - 2021-12-06T08:08:13+05:30 IST