రెవెన్యూ ఉద్యోగుల్లో అలజడి
ABN , First Publish Date - 2022-07-07T05:18:24+05:30 IST
ఏసీబీ దాడులతో ఉండవల్లి రెవెన్యూ కార్యాలయ ఉద్యోగుల్లో అలజడి నెలకొన్నది.
- ఏసీబీ దాడులతో అంతా గప్చుప్
- వీఆర్వోపై అనుమానాలు
- కార్యాలయానికి రాని ఉద్యోగులు
అలంపూర్ చౌరస్తా, జూలై 6 : ఏసీబీ దాడులతో ఉండవల్లి రెవెన్యూ కార్యాలయ ఉద్యోగుల్లో అలజడి నెలకొన్నది. ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన ఓ రైతు భూమి పట్టామార్పిడి వ్యవహారంలో లంచం తీసుకుంటూ, సీనియర్ అసిస్టెంట్ సాయిబాబు మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. సదరు ఉద్యోగిని విచారించి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రెండు బృందాలు రెవెన్యూ కార్యాలయంలో తనిఖీలు చేయగా, అదే సమయంలో కర్నూల్ నగరంలో అతడికి చెందిన ఇంట్లో మరో బృందం సోదాలు నిర్వహించాయి. అక్కడ ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని తెలిసింది. ఏసీబీ అధికారుల విచారణలో చిన్నఆముదాలపాడు వీఆర్వో పాత్ర కూడా ఉన్నట్లు తేలిందని సమాచారం. ఇదే వ్యవహారంపై గతంలో సదరు వీఆర్వో బాధితులను భారీగానే లంచం ఆడిగారని, కానీ బాధితులు ఒప్పుకోలేదని తమ దృష్టికి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆ వ్యవహారంపై ఉండవల్లి తహసీల్దారును కూడా విచారించామని, దర్యాప్తులో బాధ్యులుగా తేలితే చర్యలు తప్పవని చెప్పారు. అయితే ఏసీబీ దాడుల విషయం తెలుసుకున్న చిన్నఆముదాలపాడు వీఆర్వో మంగళవారం కార్యాలయానికి రాకుండా మార్గంమధ్య నుంచే వెను దిరిగినట్లు సిబ్బంది చర్చించుకున్నారు. బుధవారం అతడితో పాటు, ఆర్ఐ, వీఆర్వో, సర్వేయర్, మరికొంత మంది సిబ్బంది కూడా కార్యాలయానికి రాలేదని తెలిసింది. మంగళవారం జరిగిన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు తహసీల్దార్ వీరభద్రప్పను నివేదిక కోరినట్లు సమాచారం.
ఇది రెండో సారి..
మండలాల విభజనలో భాగంగా మానవపాడు మండలం కింద ఉన్న ఉండవల్లిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ మండలంలో ఏసీబీ దాడులు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం ఇదే కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న హరికృష్ణ కంచుపాడు గ్రామానికి చెందిన రైతు సత్యారెడ్డి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మళ్లీ ఇప్పుడు ఏసీబీ దాడులు జరగడం, సీనియర్ అసిస్టెంట్ రెడ్ హ్యాండెడ్గా చిక్కడం స్థానికంగా చర్చకు దారితీసింది.