కలవర పెడుతున్న కరోనా
ABN , First Publish Date - 2022-01-22T06:22:32+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ, తహసీల్దార్, ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఏడు గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పోలీసు స్టేషన్లు, పాఠశాలలు, బ్యాంకుల్లో బయట పడుతున్న కేసులు
కైకలూరు, జనవరి 21 : ప్రభుత్వ కార్యాలయాల్లో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ, తహసీల్దార్, ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఏడు గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రభుత్వాసుపత్రిలో గతంలో ముగ్గురికి పాజిటివ్ రాగా మరో నలుగురికి శుక్రవారం నిర్ధారణ అయ్యింది. సిబ్బంది హోమ్ ఐసోలేషనలో ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదిలక్ష్మి తెలిపారు. తహసీల్దార్కు పాజిటివ్ రావడంతో కార్యాలయ సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల సంక్రాంతి మూడు రోజులు పేకాట, కోడిపందలే శిబిరంలో పాల్గొన్నవారు పలువురుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. మాస్కులు, భౌతికదూరం మరచి ప్రజలు విచ్చలవిడిగా తిరగడం వలన కరోనా బారిన పడ్డారు. అనేకమంది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటూ హోమ్ఐసోలేషన్లో ఉన్నట్లు సమాచారం. పాజిటివ్ వచ్చినవారు, తమను కలిసిన వారికి సమాచారం ఇచ్చి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్
మోపిదేవి : మోపిదేవి పంచాయతీ శివారులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఏకైక ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం పాజిటివ్గా నిర్ధారణ కావటంతో పది రోజులపాటు ఆయన సెలవుపై వెళ్లారు. మరొక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై పంపి పాఠశాలన యథావిధిగా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. మెరకనపల్లి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కాగా, పంచాయతీ తరగతి గదులు, పాఠశాల ఆవరణను శుక్రవారం శానిటైజ్ చేశారు.
బ్యాంకు ఉద్యోగులకు పాజిటివ్..
మోపిదేవిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. బుధవారం స్వల్ప లక్షణాలతో కరోనా పరీక్షకు వెళ్లారు. శుక్రవారం ఉదయం పాజిటివ్గా నిర్ధారణ కావటంతో తాత్కాలికంగా సేవలు నిలిపివేశారు. తిరిగి సోమవారం నుంచి యథావిధిగా పనిచేయనున్నట్లు బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు.
పోలీసు సిబ్బందిలో ఆందోళన
ముదినేపల్లి : కరోనా పాజిటివ్ కేసులు మండలంలో పెరుగుతున్నాయి. పోలీసు స్టేషన్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సిబ్బందికి భయం పట్టుకుంది. కొంతమంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సిబ్బంది కుటుంబసభ్యులతో సహా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కేసులు పెరుగుతుండటంతో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్లి పరీక్షలు చేయటం చేస్తున్నారు. కొరగుంటపాలెం గ్రామంలో హెల్త్ సూపర్వైజర్ పరీక్షలు నిర్వహించారు.