దివీస్ ల్యాబ్స్ కళకళ
ABN , First Publish Date - 2020-08-11T06:20:14+05:30 IST
హైదరాబాద్కు చెందిన ఔషధ కంపెనీ దివీస్ ల్యాబ్స్ సోమవారం స్టాక్ మార్కెట్లో మదుపర్లను ఆకర్షించింది. దీంతో ఇంట్రాడేలో ఏకంగా ఎన్ఎ్సఈలో 18 శాతానికి పైగా పెరిగింది...
- ఇంట్రాడేలో ఏడాది గరిష్ఠానికి షేరు
- రూ.82,749 కోట్లకు మార్కెట్ విలువ
- మార్కెట్ క్యాప్లో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన ఔషధ కంపెనీ దివీస్ ల్యాబ్స్ సోమవారం స్టాక్ మార్కెట్లో మదుపర్లను ఆకర్షించింది. దీంతో ఇంట్రాడేలో ఏకంగా ఎన్ఎ్సఈలో 18 శాతానికి పైగా పెరిగింది. షేరు ధర ఏడాది గరిష్ఠ స్థాయిని తాకింది. 2020లో ఇప్పటి వరకూ దివీస్ షేరు ధర దాదాపు 65 శాతం పెరిగింది. ఇంట్రాడేలో షేరు ధర ఆకర్షణీయంగా పెరగడంతో స్టాక్ మార్కెట్లో నమోదైన రెండో అతిపెద్ద విలువైన ఫార్మా కంపెనీగా దివీస్ నిలిచిందని, మార్కెట్ విలువ రూ.82,749 కోట్లకు చేరిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్ విలువలో సన్ ఫార్మా తర్వాతి స్థానంలో నిలిచింది. సన్ ఫార్మా మార్కెట్ విలువ రూ.1.28 లక్షల కోట్లు. ఆదాయపరంగా దివీస్ 14వ స్థానంలో ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం బీఎ్సఈలో కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో 15.93 శాతం పెరిగి రూ.3,228 స్థాయిని తాకింది. చివరకు 11.95 శాతం లాభంతో రూ.3,117.10 వద్ద ముగిసింది. ఎన్ఎ్సఈలో దివీస్ షేరు ధర ఒక దశలో 18.24 శాతం పెరిగి రూ.3,293ని తాకి చివరకు రూ.3,120.75 వద్ద క్లోజైంది.
రికార్డు స్థాయి త్రైమాసిక లాభం
జూన్తో ముగిసిన త్రైమాసికంలో దివీస్.. ఏకీకృత ప్రాతిపదికన రూ.492 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.272 కోట్లతో పోలిస్తే 81 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి మొ త్తం ఆదాయం 47 శాతం వృద్ధితో రూ.1,193 కోట్ల నుంచి రూ.1,748 కోట్లకు చేరింది. త్రైమాసిక ఫలితాలు బాగా ఉండడంతో దివీస్ షేరు సోమవారం ఆకర్షణీయంగా పెరిగిందని హైదరాబాద్కు చెందిన బ్రోకింగ్ కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. అయితే..మొదటి త్రైమాసికం స్థాయిలోనే మొ త్తం ఏడాది ఫలితాలను ఆశించలేమన్నారు. కాగా జూన్ త్రైమాసికంలో కంపెనీపై కొవిడ్ ప్రభావం అంతగా లేదని తెలిపింది.