అలంపూర్ అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-03-02T05:21:20+05:30 IST
ఐదవ శక్తి పీఠంగా పేరుగాంచిన అలంపూర్ ఆలయాల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
అలంపూర్, మార్చి 1 : ఐదవ శక్తి పీఠంగా పేరుగాంచిన అలంపూర్ ఆలయాల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శివరాత్రి సందర్భంగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన రుద్రాభిషేకం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం ద్వారా రూ.36 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రసాద్ స్కీం కింద చేపడ్తున్న పనులలో కేంద్ర పురావస్తుశాఖ నుంచి ఆటంకాలు కలుగకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కృషి చేసినట్లు గుర్తు చేశారు. ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం నెలకొందని, ఆ దేశంలో భారతీయ విద్యార్దులు చదువుకోవటానికి వెళ్లి ఇరుక్కొని భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురు కేంద్ర మంత్రులు ఆదేశ సరిహద్దు ప్రాంతాలకు చేరుకొని విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో రప్పిస్తున్నట్లు తెలిపారు.