కూటమిపై ఏం చేద్దాం.. డీఎండీకేలో తర్జనభర్జన!?

ABN , First Publish Date - 2021-01-07T17:26:28+05:30 IST

అధికార అన్నాడీఎంకే కూటమిలో కొనసాగుతున్న డీఎండీకే..

కూటమిపై ఏం చేద్దాం.. డీఎండీకేలో తర్జనభర్జన!?

చెన్నై : అధికార అన్నాడీఎంకే కూటమిలో కొనసాగుతున్న డీఎండీకే.. మున్ముందు ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జన పడుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ కూటమిలో కొనసాగాలా? లేక వేరే మార్గం చూసుకోవాలా అనేదానిపై తీవ్రంగా యోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు డీఎంకే-అన్నాడీఎంకే కూటములు ముమ్మర సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమి నుంచి పోటీ చేసిన డీఎండీకే అధినేత విజయకాంత్‌ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగింది. పీఎంకే, బీజేపీ, ఎండీఎంకే వంటి పార్టీలున్న ఆ కూటమి ఘోర పరాజయం పాలైంది. అయితే అలాంటి పరాజయం ఈసారి పునరావృతం కారాదాని డీఎండీకే గట్టిగా తలపోస్తోంది.


ఇప్పటివరకూ డీఎండీకే మూడు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన డీఎండీకే రాష్ట్రవ్యాప్తంగా 5 శాతం ఓట్లు సాధించగా, విజయకాంత్‌ మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2011లో అన్నాడీఎంకేతో జత కట్టిన డీఎండీకే.. ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కానీ 2016 ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గణనీ యమైన స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. 


పార్టీ అధినేత విజయకాంత్‌, ఆయన సతీమణి ప్రేమలత పార్టీ నేతలతో జోరుగా మంతనాలు జరుపుతున్నారు. కానీ అన్నాడీఎంకే కూటమిలో తమకు అంతగా ప్రాధాన్యతివ్వడం లేదన్న అసంతృప్తి నేతల్లో వుంది. అందువల్ల ఆ కూటమిలో కొనసాగాలా, లేక ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలా అన్నదానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికి అన్నాడీఎంకే కూటమిలోనే వున్నామని, మునుముందు ఏం చేయాలన్నదానిపై విజయకాంత్‌ తగిన నిర్ణయం తీసుకుంటారంటూ పలుమార్లు ప్రేమలత ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్న నేతలు.. త్వరలో జరుగనున్న సమావేశంలో కూలంకుషంగా చర్చించనున్నారు. అందరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం విజయకాంత్‌ తగిన నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Updated Date - 2021-01-07T17:26:28+05:30 IST