బీజేపీ నేత ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి వెళ్లిపోతారా?

ABN , First Publish Date - 2021-05-08T22:07:28+05:30 IST

రాజకీయ మార్గంలో తాను దృఢ చిత్తంతో ఉన్నానని బీజేపీ నేత ముకుల్

బీజేపీ నేత ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి వెళ్లిపోతారా?

కోల్‌కతా : రాజకీయ మార్గంలో తాను దృఢ చిత్తంతో ఉన్నానని బీజేపీ నేత ముకుల్ రాయ్ చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో ఆయన తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోతారని జరుగుతున్న ప్రచారానికి తెర దించారు. తాను బీజేపీ సైనికుడిగానే కొనసాగుతానని చెప్పారు. శనివారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 


‘‘మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు బీజేపీ సైనికుడిగా నా పోరాటం కొనసాగుతుంది. అందరూ తమ కల్పనలకు, ఊహాగానాలకు తెర దించాలని కోరుతున్నాను. నేను నా రాజకీయ మార్గంలో దృఢ నిశ్చయంతో ఉన్నాను’’ అని ముకుల్ రాయ్ ట్వీట్ చేశారు. 


తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 77 స్థానాలు లభించాయి. కృష్ణా నగర్ (ఉత్తర) నియోజకవర్గం నుంచి ముకుల్ రాయ్ గెలిచారు. శుక్రవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ఆయన 2017లో టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. ఆయన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో జయాపజయాల ఆధారంగా ఆయనను అంచనా వేయకూడదని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఆధిపత్యం కొనసాగుతోందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ రైజింగ్ స్టార్‌గా ఆయన వెలుగుతున్నారంటున్నారు. 


Updated Date - 2021-05-08T22:07:28+05:30 IST