బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు

ABN , First Publish Date - 2021-12-02T07:09:43+05:30 IST

బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి రైతులను కోరారు.

బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను వేయాలి  

అన్నదాతల మేలు కోరి ప్రభుత్వ నిర్ణయం  

ఓటమి భయంతోనే సాగుచట్టాలు వెనక్కి ఫ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి 

నిర్మల్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి రైతులను కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగిలో రైతు లు వరి పండించవద్దని విజ్ఙప్తి చేశారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను వేయాలని సూచించారు. ఓ వైపున యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.... రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం వరిధాన్యం కొనుగోలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిందేమి లేదన్నారు. రైతుల శ్రే యస్సు కోసం రాష్ట్రప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, ఆయన చెప్పే మాటలను ప్రజలను విశ్వసించడం లేదన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఐదురాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే  సాగుచట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్య మించిన 750 మంది రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. సాగుచట్టాల రద్దుపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేసినా.. చర్చ జరపకుండానే నిమిషాల వ్యవధిలో బిల్లుకు ఆమోదం తెలిపారని బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సాగు చట్టాలను నిరసిస్తూ పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ మానవతా దృక్ఫథంతో ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారన్నారు. 750 మంది రైతు కుటుంబాలకు రూ. 22.50 కోట్లు అందజేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఒక్కో బాధిత రైతు కుటుంబానికి రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని మంత్రి అల్లోల డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు లు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీజేపీ నాయకుల మాయ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ నల్ల వెంకట్రామ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ రఘునంధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేంధర్‌, మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, నిర్మల్‌, సారంగాపూర్‌ ఏయంసీ చైర్మన్‌లు నర్మద ముత్యంరెడ్డి, వంగ రవీంధర్‌రెడ్డిలతో పాటు ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ గారి రాజేంధర్‌, నిర్మల్‌, సారంగాపూర్‌ మండలాల అధ్యక్షులు కొరిపల్లి రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాజిద్‌ఖాన్‌, ఆత్మచైర్మన్‌ గంగారెడ్డి, కౌన్సిలర్‌లు పూదరి రాజేశ్వర్‌, ఎస్పీ రాజు, నరహరి, టీఆర్‌ఎస్‌ నిర్మల్‌ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం పట్టణాధ్యక్షులు అప్పాల వంశీ, టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సాగౌడ్‌, ముత్యంరెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T07:09:43+05:30 IST