ఆక్సిజన్ నిల్వలపై అపోహలొద్దు
ABN , First Publish Date - 2021-05-17T06:40:02+05:30 IST
ఆక్సిజన్ నిల్వలపై అపోహలు అవసరం లేదని, పటిష్ఠ కార్యాచరణతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని జేసీ వీరబ్రహ్మం పేర్కొన్నారు.
ప్రస్తుతానికి సరిపడా ఉంది: జేసీ
తిరుపతి, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్ నిల్వలపై అపోహలు అవసరం లేదని, పటిష్ఠ కార్యాచరణతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని జేసీ వీరబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం ఆర్డీవో కార్యాలయంలో రీఫిల్లింగ్ కేంద్రాల యజమానులు, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్లకు అనుగుణంగా ప్రాణవాయువును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘నిల్వలు, వినియోగం, వృథాపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆక్సిజన్ మేనేజ్మెంట్పై నిర్దిష్ట ప్రణాళిక తయారుచేసి మంగళవారం ఉదయంలోపు కలెక్టర్కు ఇవ్వాలి. ప్రస్తుతానికి అవసరానికి సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. జిల్లా రోజూ 23 టన్నుల ఆక్సిజన్ ఇతరప్రాంతాల నుంచి వస్తోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని జేసీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో కనకనరసారెడ్డి, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ బాలాంజనేయులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన తదితరులు పాల్గొన్నారు.