బెంగాల్‌ను గుజరాత్‌లా మార్చవద్దు

ABN , First Publish Date - 2021-04-09T06:37:34+05:30 IST

బీజేపీకి ఓటువేసి పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌లా మార్చవద్దని ఓటర్లకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. దుర్గా పూజల్లాంటి వేడుకలను కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయవద్దని ఆమె కోరారు

బెంగాల్‌ను గుజరాత్‌లా మార్చవద్దు

ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి: మమత


బాలాగఢ్‌, ఏప్రిల్‌ 8: బీజేపీకి ఓటువేసి పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌లా మార్చవద్దని ఓటర్లకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.  దుర్గా పూజల్లాంటి వేడుకలను కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయవద్దని ఆమె కోరారు. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఓ వర్గం గ్రామాలను సందర్శించి ఓటర్లను బెదిరించే అవకాశం ఉందని, కాబట్టి ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. గురువారం హుగ్లీ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘‘కేంద్ర పారామిలిటరీ బలగాలంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆ బలగాలు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయి. పోలింగ్‌కు ముం దు రోజు ఆ బలగాలు గ్రామస్థులపై అరాచకాలకు పాల్పడుతున్నాయి. బీజేపీకి ఓటు వేయాలని వారు అడుగుతున్నారు. మేము అలా జరగనివ్వం. రాష్ట్ర పోలీసు బలగాలు ధైర్యంగా తమ పనిచేయాలి. ఢిల్లీ బలగాల ముందు తలవంచాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేలా చూసి రాష్ట్ర పోలీసు బలగాలు తమ నిజాయితీని చెక్కుచెదరకుండా చూసుకోవాలి’’ అని మమత అన్నారు. కాగా, బీజేపీ వారు డబ్బు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం తమకే వేయాలని ఓటర్లను టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కోరారు. 


దీదీ పాలనలో మార్పు ఎక్కడ?: యోగి

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదేళ్ల పాలనలో బెంగాల్‌లో ఎక్కడా మార్పు రాలేదని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. టీఎంసీ ప్రభుత్వంలో బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నా రు. గురువారం హుగ్లీ, హౌరా జిల్లాల్లో ఆయన మాట్లాడారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే బాలికలకు ఉచిత విద్య, రవాణా సౌకర్యం కల్పిస్తామని, పోకిరీల పని పట్టడానికి యాంటీ రోమియో బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - 2021-04-09T06:37:34+05:30 IST