బ్యాంకు ఖాతా ఉందా..? ఆ మెసేజ్ వచ్చిందా..? ఈ హెచ్చరిక మీకోసమే..!

ABN , First Publish Date - 2021-04-06T22:11:09+05:30 IST

ఖాతాదారులను భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) అప్రమత్తం చేసింది.

బ్యాంకు ఖాతా ఉందా..? ఆ మెసేజ్ వచ్చిందా..? ఈ హెచ్చరిక  మీకోసమే..!

హైదరాబాద్ : ఖాతాదారులను భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) అప్రమత్తం చేసింది. ఫిక్స్‌‌డ్ డిపాజిట్ల పేరిట సైబర్ నేరగాళ్లు చేస్తున్న నయా మోసాలపట్ల హెచ్చరించింది. . కొత్త మోసం నేపధ్యంలో ఎస్‌బీఐలో ఖాతా ఉన్న కస్టమర్లు...  తమ ఖాతా వివరాలను ఇతరులెవరికీ వెల్లడించొద్దని సూచించింది. 


ఏం జరిగిందంటే...

 ఎస్‌బీఐ సిబ్బంది పేరిట బ్యాంకు ఖాతాదారులకు ఫోన్ చేసి వారి వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు. అలా సేకరించిన వివరాల ఆధారంగా ఖాతాదారుల ఖాతాల నుంచి సొమ్మును కాజేస్తున్నారు. ఇదే అంశంపై ఎస్‌బీఐకి కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన ఎస్‌బీఐ.. తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరిన నయా మోసం...

ఎస్‌బీఐ సిబ్బంది అంటూ సైబర్‌ నేరగాళ్లు.. వినియోగదారుల పేరుతో ఫేక్ ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను సృష్టిస్తున్నారు. అలా అసలు ఖాతాదారులకు ఫోన్ చేసి.. మీ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం జరుగుతుందని, వెరిఫికేషన్ కోసం ఖాతా వివరాలు చెప్పాలంటూ వివరాలు తెలుసుకుంటున్నారు. అలా ఖాతా వివరాలు తెలుసుకుని, సొమ్మును స్వాహా చేస్తున్నారు. 


ఈ క్రమంలో ఎస్‌బీఐ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఎస్‌బీఐకి దాదాపు 42 కోట్ల మంది ఖాతాదారులున్నారు. వారందరికీ ఎస్‌బీఐ సందేశాలను పంపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ పోస్టులు పెట్టింది. ఖాతాదారులు తమ పాస్‌వర్డ్స్, ఓటిపీ, సీవీవీ కార్డ్ నంబర్, తదితర వివరాలను ఎస్‌బీఐ అడగదని స్పష్టం చేసింది. అలాగే ఈ వివరాలను ఇతరులెవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. ఫోన్ మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఏవైనా సందేహాలుంటే నేరుగా సంబంధిత బ్రాంచ్‌ను సంప్రదించాలని కోరింది. 


ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఫోన్ కాల్, ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్ ల ద్వారా తెలియని వ్యక్తి సమాచారం అడిగితే వెల్లడించవద్దని హెచ్చరించింది. 


అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు...

బ్యాంక్ సమాచారం కావాల్సినట్లయితే.. ఎప్పుడూ సంబంధిత బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమాచారాన్ని సేకరించుకోవాలని స్పష్టం చేసింది.


ఎవరైనా మీ సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించినట్లయితే... సమీప ఎస్‌బీఐ శాఖ, పోలీసు అధికారులకు వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయాల్సిందిగా బ్యాంకు సూచించింది. 

Updated Date - 2021-04-06T22:11:09+05:30 IST