ఈ భార్యాభర్తలిద్దరి వయసు 80 ఏళ్లు పైనే.. ఇంట్లో రూ.కోటి డబ్బు.. వడ్డీలకు ఇస్తూ సంపాదించినదంతా ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - 2021-11-27T23:25:47+05:30 IST

జైపూర్‌లో చాలా ఘోరం జరిగింది. 80 ఏళ్ల వయసున్న దంపతులు.. వడ్డీలకు డబ్బులు ఇస్తూ బాగా సంపాదించారు. ఎలాంటి ఇబ్బందులూ లేవనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా

ఈ భార్యాభర్తలిద్దరి వయసు 80 ఏళ్లు పైనే.. ఇంట్లో రూ.కోటి డబ్బు.. వడ్డీలకు ఇస్తూ సంపాదించినదంతా ఒక్కరోజులోనే..
సుర్తాదేవి(ఫైల్), గాయపడిన పంచురామ్

ఒక్కోసారి ఊహించని పరిస్థితుల కారణంగా ఉన్న సంపాదన మొత్తం ఊడ్చుకుపోతుంటుంది. ముందుచూపు లేకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే జైపూర్‌లో మాత్రం చాలా ఘోరం జరిగింది. 80 ఏళ్ల వయసున్న దంపతులు.. వడ్డీలకు డబ్బులు ఇస్తూ బాగా సంపాదించారు. ఎలాంటి ఇబ్బందులూ లేవనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా అనుకోని ఘటన జరిగింది. ఒక్కరోజులోనే వారి జీవితం తలకిందులైంది.. వివరాల్లోకి వెళితే..


జైపూర్ రూరల్‌లోని నరైనా పట్టణ పరిధి ఖటిక్స్ ధాని ప్రాంతంలో పంచురామ్ ఖాటిక్(85), సుర్తా దేవి(80) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు కేన్సర్ వ్యాధితో మృతి చెందాడు. దీంతో కోడలు దూరంగా ఉంటోంది.  పంచురామ్ ఖాటిక్ 60 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఇలా మొత్తం కోటి రూపాయలకు పైగానే సంపాదించాడు. అలాగే 25 తులాల బంగారం, 12 కిలోల వెండి కూడా ఉంది. నగదు, నగలను బ్యాంకుల్లో పెట్టడం ఎందుకని.. ఇంట్లోని అల్మారాలు, పెట్టెల్లో దాచుకున్నారు. ఈ దంపతుల దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనే విషయం స్థానికులందరికీ తెలుసు.


ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దంపతులు ఇంట్లో నిద్రిస్తూ ఉండగా.. ముగ్గురు దుండగులు ఇంటి పైకప్పు తొలగించి, లోపలికి ప్రవేశించారు. మంచంపై పడుకుని ఉన్న పంచురామ్‌పై ఇద్దరు దుండగులు దాడి చేశారు. అతడిపై పిడిగుద్దులు కురిపించడం మొదలెట్టారు. గట్టిగా కేకలు వేయడంతో సుర్తాదేవి అక్కడికి వచ్చింది. తమను విడిచిపెట్టాలని ప్రాధేయపడింది. అయినా కనికరించని ఆ దుండగులు.. ఆమెను భర్త కళ్ల ముందే గొంతు కోసి హత్య చేశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న పంచురామ్.. మెలకువ వచ్చి చూడగా భార్య విగతజీవిగా పడి ఉంది.


పంచురామ్‌ను బెదిరించిన దుండగులు.. ఇంట్లోని రూ.కోటిన్నర నగదు, నగలతో పరారయ్యారు. అక్కడికి చేరుకున్న స్థానికులు జరిగిన ఘటనను చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం పరిశీలించారు. జైపూర్ రూరల్ ఎస్పీ మనీష్ అగర్వాల్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందం నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్యలో తెలిసిన వారి హస్తం ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-11-27T23:25:47+05:30 IST