HYD : భార్యాభర్తలు గొడవ.. మధ్యలో వచ్చిన బావమరిదిని పొడిచేశాడు!
ABN , First Publish Date - 2021-11-20T13:44:30+05:30 IST
సాయంత్రం 7గంటల సమయంలో మల్లారెడ్డి ఆమె ఉంటున్న ఇంటి..
హైదరాబాద్ సిటీ/మాదాపూర్: భార్యాభర్తలు గొడవ పడుతుండగా, మధ్యలో వచ్చిన బావమరిదిని తనవెంట తెచ్చుకున్న కత్తితో వెన్నులో పొడిచాడు. ఈ సంఘటన శుక్రవారం మాదాపూర్లో చోటుచేసుకుంది. మాదాపూర్ ఎస్సై రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి(41) జనరల్ ఫిజీషియన్. జ్యోష్ణ చిల్డ్రన్స్ డాక్టర్. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో జ్యోష్ణ చంద్రనాయక్తండాలోని ఆమె తల్లి ఇంటికి వచ్చింది. భార్య తిరిగి రావడం లేదన్న కోపంతో శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో మల్లారెడ్డి ఆమె ఉంటున్న ఇంటికి కత్తిని వెంట తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండగా జ్యోష్ణ చెల్లెలు, తమ్ముడు శివానంద్రెడ్డి మధ్యలో వచ్చారు. ఆగ్రహంతో మల్లారెడ్డి బావమరిది శివానంద్రెడ్డి వెన్నులో కత్తితో పొడిచాడు. కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శివానంద్రెడ్డి తల్లి అరుణాదేవి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.