రాళ్లకు బదులు కిడ్నీనే తొలగించిన వైద్యుడు!

ABN , First Publish Date - 2021-10-20T02:52:16+05:30 IST

ఓ వైద్యుడు పొరపాటుపడ్డాడు. కిడ్నీలో రాళ్లు తొలగించాల్సింది పోయి ఏకంగా కిడ్నీనే తొలగించాడు. ఫలితంగా రోగి మరణించాడు.

రాళ్లకు బదులు కిడ్నీనే తొలగించిన వైద్యుడు!

మహిసాగర్: గుజరాత్‌లోని ఓ వైద్యుడు పొరపాటుపడ్డాడు. కిడ్నీలో రాళ్లు తొలగించాల్సింది పోయి ఏకంగా కిడ్నీనే తొలగించాడు. ఫలితంగా రోగి మరణించాడు. 2011లో ఈ ఘటన జరగ్గా.. బాధిత కుటుంబానికి రూ. 11 లక్షలు చెల్లించాలని తాజాగా వినియోగదారుల ఫోరం ఆ ఆసుపత్రిని ఆదేశించింది.


ఖేడా జిల్లాలోని వంఘ్రోలికి చెందిన దేవేంద్రభాయ్ రావల్ మే 2011లో తీవ్రమైన నడుము నొప్పితో పాటు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. దీంతో అతడు మహీసాగర్ జిల్లా బాలాసినోర్‌లోని కేఎంజీ జనరల్ ఆసుపత్రి వైద్యులను కలిశాడు. పరీక్షించిన వైద్యులు అతడి ఎడమ మూత్రపిండంలో 15 మిల్లీమీటర్ల రాయి ఉన్నట్టు గుర్తించారు. 


ఆ రాయిని తొలగించేందుకు చేసిన శస్త్రచికిత్సలో కిడ్నీలోని రాయిని తొలగించాల్సిన వైద్యుడు ఏకంగా కిడ్నీనే తొలగించాడు. అయితే, రోగి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాను ఆ కిడ్నీని తొలగించినట్టు చెబుతూ వైద్యుడు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.


ఆపరేషన్ తర్వాత సమస్య మరింత పెద్దది కావడంతో దేవేంద్ర నడియాడ్‌లోని కిడ్నీ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు ఆయనను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకేడీఆర్‌సీ)కి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ 8 జనవరి 2012న మరణించాడు. 


కేఎంజీ వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగానే దేవేంద్రభాయ్ మరణించాడంటూ కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెల్లడైంది. తమ ఉద్యోగి నిర్లక్ష్యానికి ఆసుపత్రి బాధ్యత వహించాల్సిందేనని గుజరాత్ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. 2012 నుంచి 7.5 శాతం వడ్డీతో కలుపుకుని బాధిత కుటుంబానికి రూ. 11.23 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.   

Updated Date - 2021-10-20T02:52:16+05:30 IST