మారని తీరు!
ABN , First Publish Date - 2020-09-26T09:10:46+05:30 IST
గ్రామంలోని ఆసుపత్రిలో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్
ఎమ్మెల్యే చెప్పినా విధులకు ఆలస్యంగా వైద్యులు
రౌతులపూడి, సెప్టెంబరు 25: గ్రామంలోని ఆసుపత్రిలో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గురువారం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అయినా ఎప్పటిలా శుక్రవారం వైద్యులు ఆలస్యంగానే వచ్చారు. దీంతో చుట్టుపక్కల నుంచి వచ్చిన రోగులు అవస్థలు పడ్డారు. పది గంటలకు ఇద్దరు వైద్యులు వచ్చి రెండుగంటల వరకు ఉండి వెళ్లిపోయారు. ఒకరు సెలవులో ఉండగా మరో వైద్యురాలు 12 గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఉన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలను వైద్యులు పాటించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రిలో విద్యుత్ పొదుపు పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నలుగురు వైద్యుల గదుల్లో ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. కొవిడ్ వార్డులోనైతే ఎవరూ లేకున్నా ఫ్యాన్లు తిరుగుతూ, లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.