నియోజకవర్గంలో తిరగడానికి పాస్‌పోర్ట్‌ అక్కర్లేదు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ABN , First Publish Date - 2021-01-18T04:47:42+05:30 IST

నియోజకవర్గంలో తిరగడానికి పాస్‌పోర్ట్‌ అక్కర్లేదు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నియోజకవర్గంలో తిరగడానికి పాస్‌పోర్ట్‌ అక్కర్లేదు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కుంచపర్తిలో నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పదవులు ఎవడి అబ్బ సొత్తు కాదు...

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం జిల్లా కుంచపర్తి పర్యటనలో ఘాటు వ్యాఖ్యలు

సత్తుపల్లి/వేంసూరు, జనవరి 17 : ‘ప్రజా అభిమానమే నాకు చాలా పెద్ద పదవి. నియోజకవర్గంలో తిరిగేందుకు నాకు పాస్‌పోర్టు అక్కర్లేదు. ప్రజల ప్రేమ, అభిమానం నాపై ఉన్నాయి. పదవి భగవంతుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఎవ్వరు అడ్డుపడ్డా ఆగదు. అలాగే పదవి పోయేటప్పుడు ఎన్ని కాంక్రీటు గోడలు కట్టుకున్నా పోకుండా ఆగదు. పదవులు ఎవడి అబ్బా సొత్తు కాదు’ అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి వెళ్లిన ఆయనను పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కలిసి నియోజవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిణామాలను పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారితో మాట్లాడిన పొంగులేటి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏడేడు లోకాలు అవతలున్నా వచ్చే చావు ఆగదు’ అంటూ పదవుల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని, పదవులు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఆగవన్నారు. తమను నమ్ముకున్న ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలనుకుంటే అదే ఇస్తారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కాకపోతే మూడేళ్లు.. నాలుగేళ్లు... ఐదేళ్లు ఉంటారని, ఆ తర్వాత మంచిగా పరిపాలిస్తే ప్రజలు దీవించి అధికారం ఇస్తారన్నారు. సత్తుపత్తి నాయకుడు మటాట దయానంద్‌కు పార్టీ టికెట్‌ ఆశించామని, ప్రయత్నం చేశామని, ఆయనకు దయానంద్‌కు టికెట్‌ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆనాడు చాలామంది మిత్రులు నిరసన తెలిపారని గుర్తుచేశారు. కానీ తాను దయానంద్‌కు ఒప్పించి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా.. అధిష్ఠానం నిర్ణయం మేరకే పార్టీ సూచించిన అభ్యర్థికి సహకరించామన్నారు. భవిష్యత్‌లో కూడా ఇదే పార్టీలోనే ఉంటామని, కానీ ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు చేయ్యొద్దని అభ్యర్థిస్తున్నానన్నారు. నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలియనంత అసమర్థులం కాదని, ఎదుటి వారిని కష్టపెట్టిన వారు చక్రవడ్డీతో సహా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని.. శ్రీనివాసరెడ్డి, విజయబాబు వచ్చే సమావేశాలకు, కార్యక్రమాలకు వెళ్లొద్దని చెప్పడం సరికాదని, తాము గ్రామాలకు వెళ్లాలంటే ఎవరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఏ పాస్‌పోర్టు అక్కర్లేదని, తమను అభిమానించే వారు, ఆదరించే వారు ప్రజాప్రతినిధులైనా, కార్యకర్తలైనా వారిని కలిసేందుకు వస్తానన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ ఉన్నారు.

Updated Date - 2021-01-18T04:47:42+05:30 IST