జయలలిత మెమోరియల్‌కు వెళ్ళనున్న శశికళ.. రీఎంట్రీ ప్రకటన ఉంటుందా?

ABN , First Publish Date - 2021-10-16T17:22:18+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు

జయలలిత మెమోరియల్‌కు వెళ్ళనున్న శశికళ.. రీఎంట్రీ ప్రకటన ఉంటుందా?

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ శనివారం మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, అన్నాదురైల స్మారక కేంద్రాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరగబోతున్న తరుణంలో ఆమె ఈ నేతలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. తాను రాజకీయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని ఆమె మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, శశికళ రామవరం గార్డెన్‌లోని ఎంజీఆర్ హౌస్‌లో ఉన్న స్పెషల్ స్కూల్‌ను ఆదివారం సందర్శిస్తారని తెలుస్తోంది. 


శశికళ శనివారం ఏఐఏడీఎంకే నేతల స్మారక కేంద్రాలను సందర్శిస్తే, ఆమె ఈ విధంగా చేయడం ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. ఆమె ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆమె తిరిగి పార్టీలో చేరాలనుకున్నా తలుపులు మూసేశామని ఆ పార్టీ పునరుద్ఘాటించింది. ఆ పార్టీ సీనియర్ నేత జయ కుమార్ మాట్లాడుతూ, ఆమెకు తమ పార్టీలో చోటు లేదన్నారు. 


శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్షను అనుభవించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఫిబ్రవరిలో విడుదలయ్యారు. 


Updated Date - 2021-10-16T17:22:18+05:30 IST